Visakhapatnam–Narasapuram Train Services: కోవిడ్-19 తర్వాత నిలిచిపోయిన రైలు సర్వీసులు ఇప్పటికీ తిరిగి ప్రారంభించడంతో విశాఖపట్నం- నరసాపురం మధ్య ప్రయాణించే ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ రైల్వే వినియోగదారుల సంఘం (DRUA) ఈ కీలక రైలు సేవలను వెంటనే తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డును కోరింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు కాటం ఎస్.ఎస్. చంద్రారావు వినతిపత్రాన్ని సమర్పించారు. విజయవాడ డివిజన్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడు జక్కంపూడి శ్రీకుమార్కు ఈ వినతిని అందజేశారు. ఇందులో ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ కోనసీమ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలను వివరించారు.
గతంలో విశాఖపట్నం- నరసాపురం మధ్య రైల్వే కనెక్టివిటీ ఉండేది. పగటిపూట నడిచే సింహాద్రి ఎక్స్ ప్రెస్, రాత్రిపూట పూరీ–తిరుపతి ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు ఈ ప్రాంతాలను కలిపేవి. కానీ, కోవిడ్ తర్వాత ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా ప్రయాణించే సౌకర్యం లేకపోవడం వల్ల, ప్రజలు మార్గమధ్యంలో రైళ్లు మార్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, పర్యాటకులకు కష్టంగా మారింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లేకపోవడంతో, వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చులు, సమయం రెండూ పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, ఈ ముఖ్యమైన రూట్ లో ఇంకా సేవలు పునరుద్ధరించకపోవడం విచారకరం అని వినియోగదారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసాపురం–సింహాద్రి లింక్ ఎక్స్ ప్రెస్, నరసాపురం–మచిలీపట్నం–విశాఖపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేసింది. అలాగే, తూర్పు తీర రైల్వే అధికారులు అధికార పరిధి సమస్యలను కారణంగా చూపుతున్నారని, కానీ, అలాంటి పరిపాలనా సమస్యలు ప్రయాణికుల సౌకర్యానికి అడ్డంకిగా మారకూడదని సంఘం అభిప్రాయపడింది.
ఈ సమస్యకు పరిష్కారంగా పగటిపూట నడిచే నరసాపురం–విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని సూచించింది. అదనంగా, భీమవరం జంక్షన్ వద్ద విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్కు అనుసంధానం కల్పించేలా స్లీపర్, ఏసీ, జనరల్ కోచ్లతో కూడిన రేక్ ఏర్పాటు చేయాలని కోరింది.
అటు విశాఖపట్నం–రాజమండ్రి ఈఎంయూ సర్వీస్ను నరసాపురం వరకు పొడిగించాలని వినియోగదారుల సంఘం సూచించింది. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా విశాఖపట్నం నుంచి పలాస లేదంటే రాయగడ వరకు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించాలని కూడా డిమాండ్ చేసింది. ప్రత్యేకంగా వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని సంఘం తెలిపింది.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!