Secunderabad–Belagavi Weekly Express Trains: తెలంగాణ, కర్ణాటయ మధ్య రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- బెళగావి మధ్య వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న మూడు సర్వీసులను, ఇప్పుడు వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు, రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
సికింద్రాబాద్–బెళగావి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07335/07336)కి ఇప్పుడు కొత్త నంబర్లు కేటాయించారు. ఈ రైలు ఇకపై 17073/17074గా నడుస్తుంది. ప్రతి సోమవారం సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మంగళవారం ఉదయం 10:30 గంటలకు బెళగావి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు బెళగావి నుంచి బయలుదేరి, బుధవారం ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్ ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారం, వ్యక్తిగత పనుల కోసం తరచుగా ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
అటు హైదరాబాద్–బెళగావి మధ్య నడిచే మరో సర్వీస్ కూడా రెగ్యులర్ వీక్లీ రైలుగా మారింది. ఈ రైలు 17071/17072 నంబర్లతో ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి, శుక్రవారం ఉదయం బెళగావి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇక మూడవ సర్వీస్ చర్లపల్లి–బెళగావి మధ్య నడుస్తుంది. 17075/17076 నంబర్లతో ఈ రైలు ప్రతి శనివారం చర్లపల్లి నుంచి బయలుదేరి, ఆదివారం బెళగావి నుంచి తిరిగి వస్తుంది. నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఈ రైలు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తుంది.
Read Also: విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?
ఈ మూడు రైళ్లు వారానికి ఒక్కసారి నడిచే విధంగా ప్రణాళిక చేశారు. మార్గమధ్యంలో బళ్లారి, హుబ్బళ్లి, గడగ్, ధార్వాడ్, లోండా లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్టాప్స్ వల్ల ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలకు కూడా హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడం సులభమవుతుంది. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మాత్రమే కాదు, వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు కూడా మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బెళగావి, హుబ్బళ్లి లాంటి నగరాలకు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ రైళ్లకు సంబంధించిన ప్రారంభ తేదీలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించనుంది.
Read Also: రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!