సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా ముస్తాబవుతోంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.714.73 కోట్లు కాగా, ఇప్పటివరకు 64 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని వివరించారు.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. ప్రతిరోజూ దాదాపు 180 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండగా, సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ను ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్కు కొత్త రూపు తీసుకురావడానికి పలు కీలక పనులు చేపట్టారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేలా ఐకానిక్ స్టేషన్ భవనాలు, రెండు అంతస్తుల ఎయిర్ కాన్ కోర్స్, ప్లాట్ ఫారాలపై పూర్తి స్థాయి కవరింగ్, బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలు ఈజీ చేసేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మెట్రో రైలు సేవలతో మెరుగైన అనుసంధానం కోసం ప్రత్యేక స్కైవాక్ లను నిర్మిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటికే కీలక నిర్మాణ పనులు పూర్తయ్యాయి. టెంపరరీ బుకింగ్ కార్యాలయం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బిల్డింగ్, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దక్షిణ భాగంలో అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రెండో దశ పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ భాగంలో బేస్ మెంట్ పనులు, కొత్త స్టేషన్ బిల్డింగ్నిర్మాణం, అరైవల్ ఏరియా నిర్మాణం, నార్త్ భాగంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం కొనసాగుతున్నాయి. నార్త్ స్టేషన్ బిల్డింగ్, ఎయిర్ కాన్ కోర్స్, ప్లాట్ ఫారాలపై కవరింగ్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
అటు హైదరాబాద్ వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ట్రావెలేటర్లతో కూడిన లింకేజ్ బిడ్జిలు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం కూడా కొనసాగుతోంది. సికింద్రాబాద్ తూర్పు, పశ్చిమ మెట్రో స్టేషన్లను అనుసంధానించే స్కైవాక్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు రైలు, మెట్రో, రోడ్డు రవాణా మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ తెలంగాణకు ఆధునిక రైల్వే ముఖద్వారంగా మారుతుందని అధికారులు చెప్తున్నారు.
Read Also: ఫ్రీ ఎంఎంటీఎస్ ట్రావెల్ కు నో.. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైల్వే బోర్డు!