No Free Travel on Hyderabad MMTS: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్(MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి రైల్వే బోర్డు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు భారీ నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రస్తుతం వస్తున్న నష్టాలతో పాటు భవిష్యత్తులో వచ్చే అదనపు ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని షరతు విధించింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల టికెట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్తూ.. జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కూడా పరిశీలన కోసం పంపింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించిన రైల్వే బోర్డు పలు ఆర్థిక అంశాలను ప్రస్తావించింది. ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణ ఇప్పటికే రైల్వేలకు భారంగా మారిందని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీఎస్ నిర్వహణకు రూ.179 కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయం కేవలం రూ.16.81 కోట్లేనని వెల్లడించింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.162 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డు అభిప్రాయపడింది. అందువల్ల ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న నష్టాలతో పాటు భవిష్యత్తులో ఏర్పడే అదనపు వ్యయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల అంశాన్ని కూడా రైల్వే బోర్డు ప్రస్తావించింది. ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇంకా రూ.490 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని తెలిపింది. ముందుగా ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. పూర్తి స్థాయి ఆర్థిక హామీలు లేకుండా ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టంగా పేర్కొంది.
రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ లేఖను రాష్ట్ర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్కు సంబంధించిన పలు కీలక రైల్వే, మెట్రో ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ ప్రణాళికలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులతో పాటు ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదన అంశాన్ని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తర్వాత ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ పథకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also: మెట్రో వ్యవస్థ సేఫ్.. అమీర్ పేట ఫైర్ యాక్సిడెంట్ తర్వాత హెచ్ఎంఆర్ఎల్ క్లారిటీ!