KTR Letter to Petroleum Minister: దేశంలో నెలకొన్న వాణిజ్య గ్యాస్ (LPG) కొరతపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన ఈ లేఖలో గ్యాస్ సంక్షోభం వల్ల సామాన్యులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించి గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించినా.. వాణిజ్య రంగంపై పడ్డ భారాన్ని కేంద్రం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్లోనే దాదాపు 90 శాతం హోటళ్లు గ్యాస్ అందక మూతపడే స్థితికి చేరుకున్నాయని కేటీఆర్ హెచ్చరించారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కేటాయింపులో ఒకే విధానం కాకుండా వర్గీకరణ ఉండాలని కేటీఆర్ సూచించారు. పెద్ద పెద్ద హోటల్ చైన్లను చిన్నపాటి వీధి వ్యాపారులతో సమానంగా చూడటం భావ్యం కాదన్నారు. రోడ్డు పక్కన బండి పెట్టుకుని బతికే చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే గ్యాస్ లభ్యతపై పారదర్శకత కోసం రియల్ టైమ్ డ్యాష్బోర్డ్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనివల్ల మార్కెట్లో నెలకొన్న గందరగోళం, కృత్రిమ కొరత తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్ దందా సాగుతోందని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. మూడు రెట్లు అధిక ధరకు గ్యాస్ విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గ్యాస్ ధరలపై తక్షణమే నియంత్రణ విధించాలని కోరారు. ధరలను స్తంభింపజేయడం ద్వారా సామాన్యులపై పడే భారాన్ని తగ్గించవచ్చన్నారు. ఐటీ రంగంలో పనిచేసే లక్షలాది మందికి భోజన సౌకర్యం కల్పించే పీజీ హాస్టళ్లకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో గుర్తుచేశారు.
సంక్షోభ నివారణకు ఐటీ రంగంలో కనీసం 50 శాతం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు ఇవ్వాలని కేటీఆర్ కేంద్రానికి సూచన చేశారు. దీనివల్ల కార్పొరేట్ క్యాంపస్లలో గ్యాస్ వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. శ్మశానవాటికలను కూడా అత్యవసర సేవల కింద గుర్తించాలని కోరారు. గ్యాస్ అందక అంతిమ సంస్కారాలు ఆగిపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. హోటల్ రంగంపై ఆధారపడి బతికే 80 లక్షల మంది దినసరి కూలీల కోసం తక్షణ ఉపశమన ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోరారు.