Warangal Airport: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ (ఓరుగల్లు) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ఐటీ, పర్యాటక రంగాల్లో దూసుకుపోతున్న వరంగల్ నగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరబోతోంది. వరంగల్ మామిడనూరు (మామునూరు) ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
వరంగల్ విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా రన్ వే నిలుస్తోంది. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో ఈ రన్వేను నిర్మిస్తున్నారు. దీనివల్ల సాధారణ ఏటీఆర్ విమానాలతో పాటు.. కాస్త పెద్దవైన ఏ-320 (A-320) రకం ప్యాసింజర్ విమానాలు, కార్గో (సరుకు రవాణా) విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. భవిష్యత్తులో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఈ రన్వేను మరింత విస్తరించేందుకు కూడా మార్గం సుగమంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
విమాన ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించేలా వరంగల్ ఎయిర్ పోర్టులో ‘స్మార్ట్ టెర్మినల్’ భవనాన్ని డిజైన్ చేశారు. రద్దీ సమయాల్లో ఒకేసారి 850 మంది ప్రయాణికులు ఈ టెర్మినల్లో ఉండేలా దీని సామర్థ్యాన్ని పెంచారు. అత్యాధునిక లైటింగ్, విశాలమైన వెయిటింగ్ లాంజ్లు, కేఫ్లు, షాపింగ్ ఏరియాలతో ఈ టెర్మినల్ భవనం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.
సమయాన్ని ఆదా చేస్తూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ స్మార్ట్ టెర్మినల్లో ‘సెల్ఫ్ చెక్ ఇన్’ కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు బోర్డింగ్ పాస్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ కియోస్క్ల ద్వారా తమంతట తామే చెక్ ఇన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాగే లగేజ్ డ్రాప్ పాయింట్లు కూడా స్మార్ట్ టెక్నాలజీతో పనిచేస్తాయి.
ప్రయాణికుల రక్షణ కోసం ఎయిర్ పోర్టులో అనేక భద్రతాపరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు, ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, ఫ్రిస్కింగ్ ఫ్లాట్ ఫారమ్ లతో కూడిన ప్రయాణికుల ప్రత్యేక తనిఖీ ప్రాంతాలు విమానాశ్రయంలో ఉండనున్నాయి. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ రూపకల్పనలో ఓరుగల్లు సంస్కృతి ప్రతిబింబించాలని, కాకతీయల సాంస్కృతిక కళ ఉట్టిపడాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే బిడ్డర్లను కోరింది.
Also Read: విజయ్ మార్క్ పాలిటిక్స్.. సీఎం కుర్చీపై టవల్ అవుట్.. సోషల్ మీడియా పుణ్యమేనా?
వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, లక్నవరం వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుందని అంచనావేస్తున్నారు. అలాగే వరంగల్లోని ఐటీ హబ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లకు దేశ విదేశీ పెట్టుబడిదారులు నేరుగా వచ్చేందుకు ఈ విమాన కనెక్టివిటీ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మెుత్తంగా శంషాబాద్ విమానాశ్రయం తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు సాగించే రెండో అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్ ఎయిర్ పోర్ట్ నిలవబోతోందని చెప్పవచ్చు.
Also Read: BSNL నమ్మశక్యం కాని ఆఫర్.. 330 రోజుల పాటు.. అపరిమిత కాల్స్, డేటా!