Kavitha Letter to PM Modi: బండి భగీరథ్ పై పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ని వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి నుంచి తొలగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధాని మోడీని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానికి సంచలన లేఖ రాశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగాలంటే బండి పదవిలో ఉండకూడదన్నారు.
ప్రధాని మోడీకి రాసిన లేఖలో భగీరథ్ కేసుకు సంబంధించి పలు అంశాలను కవిత ప్రస్తావించారు. ముఖ్యంగా న్యాయపరమైన నిష్పక్షపాతంపై ఆందోళన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైందని గుర్తు చేశారు. మైనర్ కు సంబంధించిన కేసు కావడంతో అత్యంత సున్నితంగా, పారదర్శకంగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటం వల్ల, ఈ శాఖకు దేశంలోని పోలీసు వ్యవస్థపై పరిపాలనా సంబంధాలు ఉంటాయన్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన కుమారుడిపై కేసు నమోదవడం వల్ల దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని ఆమె లేఖలో తెలిపారు.
To guarantee a free, fair, and uninfluenced investigation into the POCSO case involving his son, @bandisanjay_bjp must be removed. His current portfolio wields significant administrative control over policing aspects. I urge the @PMOIndia @narendramodi ji to take immediate… pic.twitter.com/xFUTYK4W90
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 16, 2026
భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా, ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా జరగాలని కవిత అభిప్రాయపడ్డారు. పోలీసు విచారణ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణ లాంటి అంశాల్లో ఎలాంటి ఒత్తిడి, ప్రభావం ఉందనే భావన ప్రజల్లో కలగకూడదని అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో రాజకీయ నాయకులు నైతిక బాధ్యత తీసుకోవడం అవసరమన్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు బండి సంజయ్ ని హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆమె ప్రధానిని కోరారు. అలా చేస్తే ప్రభుత్వం న్యాయవ్యవస్థ స్వతంత్రతను గౌరవిస్తోందనే సందేశం ప్రజలకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు.
కవిత లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారితీసింది. కొన్ని పార్టీల నాయకులు కవిత లేఖను సమర్థిస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శల కోసమే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే, ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు కవిత డిమాండ్కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు రాజకీయ ఆరోపణలో భాగమని అభిప్రాయపడుతున్నారు. కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది.
Read Also: బిగ్ బ్రేకింగ్.. బండి భగీరథ్ పారిపోకుండా పోలీసుల నోటీసులు!