Kavitha : కవిత ఎపిసోడ్ తెలంగాణలో ఇంకా కాక రేపుతోంది. జాగృతితో వేరు కుంపటి పెట్టుకోవడంపై బీఆర్ఎస్ నేతలు నోట మాట రావడం లేదు. స్పందించాల్సిన కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. కేసీఆర్, హరీశ్రావు అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ నేతలెవరూ బయటకు మాట్లాడొద్దని పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అందుకే, కవిత అంత మంట పెట్టినా.. కాలు కాలిన పిల్లుల్లా గులాబీ నేతలు గమ్మునుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం జోరు పెంచారు. కవిత మాటలన్నీ అబద్దం, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండనే ఉండదంటూ కాషాయం నేతలంతా వరుస బెట్టి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం పొత్తు కుట్ర జరుగుతోందంటే.. ఎంపీ బండి సంజయ్ సైతం గతంలో విలీనం కోసం ట్రై చేస్తే తామే రిజెక్ట్ చేశామని చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్కను.. ఓ ఆట ఆడుకుంటున్నారు. లేటెస్ట్గా మాజీ ఎంపీ మధు యాష్కీ ఓ రేంజ్లో విమర్శలు చేశారు. కవిత బండారమంతా బయటపెడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ డైరెక్షన్లోనే..
కవిత బీజేపీ వదిలిన బాణం అన్నారు మధు యాష్కీ. బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నరని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందనే కోణంలో లెటర్ రాసిందని ఆరోపించారు. కవిత ఎంపీగా ఉన్నపుడు మోడీతో సెల్ఫీలు దిగారని గుర్తు చేశారు. ఇదంతా బీజేపీ వ్యూహం అన్నారు. కవితను పార్టీలోకి తీసుకునేంత దరిద్రం కాంగ్రెస్కు పట్టలేదన్నారు యాష్కీ.
రూ.2వేల కోట్ల ఆస్తులు..
బతుకమ్మ పేరుతో కవిత బతక నేర్చింది.. లిక్కర్ కేసులో 6 నెలలు జైలుకు వెళ్లొచ్చింది.. మద్యం వల్ల ఆడబిడ్డల తాళి తెగిపడుతుంటే.. రాష్ట్రంలో సరిపోలేదని ఢిల్లీలో తాగుడు దుకాణం పెట్టి స్కాం చేసిందని మండిపడ్డారు. కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అంటూ సంచలన విమర్శలు చేశారు. కవిత చేయని వ్యాపారాలు లేవు.. చేయని స్కాం లేదని తెలిపారు. గతంలో బ్యూటీ పార్లర్ నడిపిన కవితకి..
బంజారాహిల్స్లో బిల్డింగులు, 2వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
రూ.800 కోట్ల కుంభకోణం..
కవితపై నిజామాబాద్ జిల్లాలో జీఎస్టీ స్కాంలు ఉన్నాయని.. 800 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మధు యాష్కీ. జాగృతి సంస్థ పక్కా అవినీతి సంస్థ అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా డబ్బులు దోచేసారని.. జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారని చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని.. జాగృతిపై విచారణ జరగాలన్నారు.
కల్వకుంట్ల స్కాంలపై ఎంక్వైరీ..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కవిత.. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు పెట్టుుకునే వారని.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు మొజాంజాహీ మార్కెట్లో పూలు అమ్ముకున్నే వారంటూ ఎద్దేవా చేశారు మధు యాష్కీ. కవితకు కేసీఆర్ జాతిపిత కావొచ్చు కానీ, రాష్ట్రానికి మాత్రం పిశాచిలా మారి 10 ఏళ్లు దోచుకున్నారని విమర్శించారు. కేటీఆర్కి అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయని.. ఆ లెక్కలు చూసుకొని రావడానికే అక్కడికి వెళ్ళారని అన్నారు. సంతోష్ రావు సైతం చెట్ల పేరుతో కోట్ల స్కాం చేశాడని.. ఇప్పుడు చెట్లు ఎందుకు నాటడం లేదో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అంటే బంధిపోటు దొంగల పార్టీ అని.. వారు చేసిన స్కాంలపై సీఎం రేవంత్రెడ్డి విచారణ చేయించాలని కోరారు. కల్వకుంట్ల ఫ్యామిలీని శిక్షించే వరకు నిద్ర పోకూడదన్నారు మాజీ ఎంపీ మధు యాష్కీ.