VinFast EV Car: విన్ఫాస్ట్ ఈవీ కార్ల కంపెనీ నెక్ట్స్ అడుగులు ఎటు? కొత్త ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణలో పెడుతోందా? రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న చర్చలు ఎంతవరకు వచ్చాయి? భారత్ని తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జనాభా కాకుండా వ్యాపార పరంగా చాలా కంపెనీలకు కేంద్రబిందువు భారత్. ఇక్కడ తమ వ్యాపారాలు విస్తరించుకుంటే ఢోకా ఉండదని వివిధ కంపెనీల అంచనా. ఇప్పటికే ఎలన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా భారత్లో అడుగు పెట్టనున్నారు. మరో విదేశీ కార్ల కంపెనీ కూడా భారత్ మార్కెట్పై కన్నేసింది.
కార్లు కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉండడం ఒకటైతే, కంపెనీలో పని చేసేందుకు స్కిల్డ్ వర్కర్లు ఇక్కడ కొదవలేదు. ఈ రెండింటినీ అందిపుచ్చుకోవాలని భావిస్తోంది వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ ఈవీ కార్ల కంపెనీ. భారత్లో కేవలం కార్ల తయారీ కేంద్రంతోపాటు డీలర్ నెట్వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది ఆ కంపెనీ. ప్రస్తుతం తమిళనాడులోని తూతుకుడిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగు తున్నాయి. కొద్దివారాల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ఏడాదికి 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.
ALSO READ: ఫిప్కార్ట్ ధమాకా ఆఫర్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్
విన్ఫాస్ట్ వీఎఫ్7, వీఎఫ్6లను ఇక్కడ అసెంబ్లింగ్ చేయనుంది. ఇదికాకుండా తెలుగు రాష్ట్రాలపై కన్నేసింది ఆ కంపెనీ.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తోంది. చివరకు ఆ కంపెనీ ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. తమిళనాడులో మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నది ఆ కంపెనీ ఆసియా సీఈవో పామ్ సాన్ చౌ మాట.
ప్లాంటుకు సమీపంలో నౌకాశ్రయం ఉండడం ఎగుమతులకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తోంది. మరో ప్లాంటుపై ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.భారత మార్కెట్ కీలకమని, అందుకే ప్లాంటు విస్తరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-వియత్నాం మధ్య ఏళ్ల తరబడి దృఢమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారాయన.