ఇంట్లోంచి వెళ్లిపోయిన మిస్సమ్మ అనాథ ఆశ్రమంలో సీక్రెట్గా ఉంటుంది. అక్కడి పిల్లలను తన పిల్లల్లాగానే చూసుకుంటుంది. తన కూతురుతో సమానంగా అందరి పిల్లలతో నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది. ఇంతలో అక్కడికి సరస్వతి వస్తుంది. పిల్లల డ్రెస్ ఎలా ఉంది మేడం అని మిస్సమ్మ అడగ్గానే.. ఈ పిల్లల అలంకరణ బాగానే ఉందమ్మా కానీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది అంటుంది సరస్వతి. దీంతో నాకేమైంది మేడం అంటూ మిస్సమ్మ అడగ్గానే.. పిల్లలను బయటకు వెళ్లమని చెప్తుంది సరస్వతి. పిల్లలు బయటకు వెళ్లిపోగానే.. ఎలా ఉండే దానివి ఎలా ఉన్నావమ్మా.. రాణివాసంలో హాయిగా ఉండాల్సిన మీరు అయిదు సంవత్సరాలుగా మీ భర్తకు మీ ఇంటికి, మీ బంధువులకు దూరంగా ఇలా ఈ కుటీరంలో సాదా సీదా జీవితం గడుపుతున్నారు. మీరు ఇక్కడ ఉంటున్నట్టు మీ వాళ్లు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు. అన్నం పెట్టిన ఇల్లు అడవి అవుతుందని… దానం చేసిన మనిషి దరిద్రుడు అవుతాడని ఎవరో చెప్తే విన్నాను. కానీ మీ పరిస్థితి చూశాక ఆ నానుడి నిజమే అనిపిస్తుంది అంటూ బాధపడుతుంది.
మిస్సమ్మ అయ్యో మేడం మీరెందుకు అలా అనుకుంటున్నారు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను కదా..? అంటుంది. ఏం బాగుండటం అమ్మా నా అన్నవాళ్లు లేని అనాథలే ఇక్కడ ఉంటారు. కానీ మీకు అందరూ ఉండి కూడా ఇక్కడ అనాథగా బతుకుతున్నారు. ఈ ఆశ్రమం కోసం మీరు ఎంతో చేశారు. కానీ చివరకు మీరే ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మా.. అంటుంది సరస్వతి. దీంతో మిస్సమ్మ నేను ఇక్కడ ఉంటున్నది అమ్ము కోసం మేడం. తను క్షేమంగా ఉండాలి. నిండు నూరేళ్లు బతకాలని ఏడేళ్లు ఆజ్ఞాతవాసానికి వచ్చాను. అయిదేళ్లు గడిచిపోయాయి. ఇంకో రెడేళ్లు గడిచిపోతే నా ఇంటికి నేను వెళ్లిపోవచ్చు అని చెప్తుంది మిస్సమ్మ.. ఇలా మిమ్మల్ని ఆ ఇంటికి దూరం చేయడం మనోహరి కుట్రేమోనని నాకు అనుమానంగా ఉందమ్మా..? తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది అని సరస్వతి చెప్పగానే.. తను కుట్ర చేసి ఉండొచ్చు.. చేయకపోయి ఉండొచ్చు.. నాకు పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకు ప్రాణాపాయం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు కానీ ఆ టైంలో ఏమీ ఆలోచించలేదు మేడం.. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేశాను అంటుంది మిస్సమ్మ.
దీంతో సరస్వతి కోపంగా మిమ్మల్ని ఇలా ఆ ఇంటి నుంచి దూరం చేయడం మనోహరి ఉద్దేశం అయి ఉండొచ్చు కదా..? మీ భర్తను ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మనోహరి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది అని సరస్వతి చెప్పగానే.. ఆ విషయం నాకు తెలుసు మేడం కానీ పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు. పైగా నేను అక్కడ ఉండగానే అమ్ము రెండు సార్లు చావు అంచుల దాకా వెళ్లింది. ఇక నేను అక్కడ ఉండటం ఎంతమాత్రం మంచిది కాదని నేను వచ్చేశాను. పిల్లలను ఆయన చూసుకుంటారు మేడం.. అని మిస్సమ్మ చెప్పగానే.. పిల్లలను మీవారు చూసుకుంటారు అమ్మా.. కానీ మీ వారిని ఎవరు చూసుకుంటారు పైగా అప్పుడే పుట్టిన ఆ పసిబిడ్డను తండ్రికి తోబుట్టువులకు దూరంగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లు ఎంత బాధపడి ఉంటారు. వాళ్లకు దూరంగా వచ్చి మీరు ఎంత బాధపడి ఉంటారు. ఆనాడు రాముల వారికి సీతమ్మ, లవకుశులు దూరం అయినట్టు ఈనాడు మీరు మీ బిడ్డ మీ భర్తకు దూరం అయ్యారు అని చెప్పగానే..
ఇంకెన్నేళ్లు మేడం రెండేళ్లు ఆగితే అందరం కలిసి ఉంటాం.. మా గురించి మీరేం బాధపడకండి.. మా కోసం హైదరాబాద్ ఆశ్రమం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీకెంతగానో రుణపడి ఉన్నాం.. అనగానే.. లేదమ్మా.. మేమే మీకు చాలా రుణపడి ఉన్నాం.. ఆ రుణం ఇలా తీర్చుకుంటూ ఉన్నాం.. ఇంతకీ ఆరు ఎక్కడ అమ్మా..? అని అడుగుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.