Pandu Accident: బుల్లితెర ప్రేక్షకులను తన అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో అలరించిన ‘ఢీ’ షో ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన టాలీవుడ్ వర్గాలతో పాటు బుల్లితెర అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పండు మాస్టర్ కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆయన ఇక ఎప్పటికీ నడవలేరంటూ వార్తలువైరల్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
స్వయంగా రియాక్ట్ అయిన పండు మాస్టర్
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై పండు మాస్టర్ ఆసుపత్రి బెడ్పై నుంచే స్వయంగా రియాక్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ..హైదరాబాద్ కి వస్తుండగా మార్గమధ్యంలో కారులో ఉన్న వారిలో ఒకరికి వాంతులు రావడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడని తెలిపాడు. తను ఆ సమయంలో కారు దిగి రోడ్డు పక్కన నిలబడగా, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక వ్యాన్ అదుపుతప్పి కారును డీ కొట్టింది.దీంతో ఆ కారు తన మీదికి ఎక్కిందని,దాంతో తన రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
అబద్ధాలను నమ్మవద్దన్న నందు
ఇక ఇదే విషయంపై నటుడు నందు ఆసుపత్రికి వెళ్లి పండు మాస్టర్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. పండు మాస్టర్కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని నందు స్పష్టం చేశారు. నెట్టింట వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని, ఆయన అందరితో సాధారణంగా మాట్లాడుతున్నారని, మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందుతోందని, అనవసరపు అబద్ధాలను నమ్మి ఆందోళన చెందవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
సురక్షితంగా బయటపడ్డ పండు మాస్టర్
పండు మాస్టర్ విషయానికి వస్తే ..‘ఢీ’ డాన్స్ రియాలిటీ షో ద్వారా జడ్జీల మనసులు గెలుచుకుని, మాస్ స్టెప్పులతో యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ రాబట్టిన ఈ టాలెంటెడ్ డాన్స్ మాస్టర్, కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తన ముద్ర వేశారు. గతంలో విడుదలైన పలు చిన్న చిత్రాలతో పాటు రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో కూడా కొరియోగ్రాఫర్గా, నటుడిగా మెరిశారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సమయానికి వైద్యం అందడంతో ఆయన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రస్తుతం అందుతున్న చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి మళ్లీ కెమెరా ముందుకు వస్తారని ఆయన సన్నిహితులు, తోటి కొరియోగ్రాఫర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలంటూ ‘గెట్ వెల్ సూన్’ మెసేజ్లు పెడుతున్నారు.
also read :నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?