Brain Dead Medical Miracle: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. బ్రెయిన్ డెడ్గా ప్రకటించబడి, అంత్యక్రియల కోసం వెళ్తున్న ఒక మహిళ.. రహదారిపై ఉన్న ఒక భారీ గుంత కారణంగా తిరిగి ప్రాణాలు పోసుకుంది. పిలిభిత్ జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వినీతా శుక్లా అనే మహిళ ఫిబ్రవరి 22న ఇంట్లో పని చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మూడు రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించి, ఆశలు వదులుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పారు.
వైద్యులు చేతులెత్తేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్ల కోసం ఆమెను అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. బరేలీ-హరిద్వార్ 74వ జాతీయ రహదారిపై అంబులెన్స్ వెళ్తుండగా హఫీజ్ గంజ్ సమీపంలో ఒక భారీ గుంత ఎదురైంది. అంబులెన్స్ ఆ గుంతలోకి దిగడంతో ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. సరిగ్గా ఆ సమయంలోనే మరణించింది అనుకున్న వినీతలో చలనం మొదలైంది. ఆమె ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం గమనించిన ఆమె భర్త కులదీప్ కుమార్ వెంటనే అంబులెన్స్ను తిరిగి ఆసుపత్రికి మళ్లించారు. ఆసుపత్రిలో మరో 12 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకుని సోమవారం ఇంటికి చేరుకున్నారు.
వైద్య పరిభాషలో ఈ ఘటనను ‘మెడికల్ మిరాకిల్’గా పేర్కొంటున్నారు. వినీత చికిత్స పొందిన న్యూరోసిటీ ఆసుపత్రి వైద్యులు ఆమె గ్లాస్గో కోమా స్కేల్ (GCS) పాయింట్లు 15 ఉండాల్సింది 3కు పడిపోయాయని, ఇది తీవ్రమైన బ్రెయిన్ డెడ్ స్థితిని సూచిస్తుందని తెలిపారు. కళ్ళలోని ప్రతిస్పందనలు కూడా నిలిచిపోయాయని వారు వివరించారు. అయితే ఆ అంబులెన్స్ కుదుపు వల్ల ఆమె నాడీ వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోడ్డు గుంతలు ప్రాణాలు తీస్తాయని వింటుంటాం కానీ, అదే గుంత ప్రాణం పోయడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వింత ఘటనపై నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. మన దేశంలో రహదారులపై గుంతలను పూడ్చకపోవడం వెనుక అధికారులకు ఇటువంటి ప్రాణాలను కాపాడే ముందుచూపు ఏమైనా ఉందేమోనని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఇచ్చే ఎలక్ట్రిక్ షాక్ (Defibrillation) పనిచేయని చోట, మన రోడ్డుపై గుంత ఉచితంగా చికిత్స అందించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా దైవ బలం ఉంటే మరణం అంచు దాకా వెళ్ళిన వారు కూడా తిరిగి వస్తారనడానికి వినీతా శుక్లా ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది.