Elephant vs Jcb : ఆహారం కోసం అడవి నుంచి పొలాల్లోకి వచ్చిన ఓ ఏనుగును మట్టిని తవ్వేందుకు వినియోగించే జేసీబీ యంత్రంతో ఢీ కొట్టించిన ఘటన వైరల్ గా మారింది. స్థానిక పొలాల్లోకి వచ్చిన ఏనుగును చుట్టుముట్టిన వందల మంది అల్లరి మూక.. అటవీ ఏనుగును ఘోరంగా విసిగించింది. గజరాజు తోక పట్టుకుని రాక్షసానందం పొందిన మూర్ఖులు.. ఏనుగును తిరిగి వెనక్కి తోలేందుకు జేసీబీ తో అనేక మార్లు గుద్దించారు. ఈ ఘటన తాలుకు వీడియోలు ఇంటర్నేట్ లో వైరల్ గా మారగా.. జంతు సంరక్షణ ప్రేమికులు, ఇతరులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన ఫిబ్రవరి 1న పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలోని డామ్డిమ్ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆహారం కోసం అపల్చంద్ అడవి నుంచి వచ్చిన ఏనుగును స్థానికులు వెంబడించి వేధించారు. ఒకానొక దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు.. జనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పొలాల్లో నిర్మించిన వాచ్ టవర్ ను బలంగా ఢీ కొట్టింది. అయితే.. ఈ నిర్మాణం కాంక్రీట్ తో చేసింది కావడంతో ఏనుగుకు దెబ్బ తగిలింది. దాంతో.. నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఏనుగును వెంబడించారు. దాని తోకను పట్టుకుని చిరాకు పెట్టించారు.
అసలే ఆకలి, ఆపై స్థానికుల అల్లరితో భయాందోళన, కోపంతో ఊగిపోతున్న ఏనుగును అడవుల్లోకి తోలేందుకు జేసీబీ తో అనేక సార్లు గుద్దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. ఇందులో భారీ ఏనుగు జేసీబీ యంత్రాన్ని ఢీకొట్టడం, డ్రైవర్ దానిని ఎక్స్కవేటర్ బకెట్ ఉపయోగించి ఎదుర్కోవడం కనిపిస్తోంది. ఏనుగు పారిపోవడానికి తిరుగుతుండగా పక్కనే ఉన్నవారు దాని వైపు పరుగెత్తుకుంటూ వచ్చి దానిని వెంబడిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దారుణ ఘటనలో ఏనుగు నుదిటి మీద, తొండం భాగంలో తీవ్ర గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించగా, స్థానికులెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.
In India they fight Elephants with JCB Diggers pic.twitter.com/G7HxcZCJJo
— Concerned Citizen (@BGatesIsaPyscho) February 5, 2025
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రవర్తించిన తీరు సరిగా లేదని, మూగ జీవితో పరాచికాలు ఆడుతున్నారంటూ కోప్పడుతున్నారు. పైగా.. జేసీబీ వంటి యంత్రంతో ఏనుగును గుద్దించడాన్ని తప్పుపడుతున్నారు. దాంతో.. అటవీ శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసు అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టారనే ఆరోపణలతో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏనుగు ను తరిమేందుకు వాడిన జేసీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
ఈ వీడియో పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఓ యూజర్ కామెంట్ చేస్తూ..”ఏనుగు ఎంత క్రూరత్వాన్ని ఎదుర్కొంటోంది. మానుషులుగా చెప్పుకునే మనం ఆ మూగజీవి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాలలో ఈ జంతువులు పుస్తకాలలో మాత్రమే కనిపిస్తాయి.” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏనుగుల గురించి అధ్యయన చేసే కొందరు వ్యక్తులు.. సాధారణంగా ఏనుగులు తొందరగా కోపానికి గురికావని, వాటిని మరి ఎక్కువగా చిరాకు పెట్టిస్తేనే స్పందిస్తాయని అంటున్నారు. అది అభద్రతకు, ప్రమాదానికి గురవుతున్నా అనే భావన కలిగినప్పుడు.. దురుసుగా మారిపోతాయని అంటున్నారు.
Also Read : చనిపోతున్న కూతురి కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన మహిళ.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ
ఉత్తర బెంగాల్ లో ప్రస్తుతం 680 ఏనుగులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో చాలా వరకు అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి, బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలోకి వస్తుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరం పాటిస్తారు. ఈ గంభీరమైన జంతువులతో శాంతియుతంగా మెలుగుతారు. కానీ.. ఈ ఘటనలో ప్రజలు చాలా దురుసుగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.