Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వం, మరో అడుగులు ముందుకేసింది. ఆ ప్రాజెక్టుల నిమిత్తం మరో 1654 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా సీఆర్డీఏ మరో అడుగు వేసింది. రాజధాని విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం తాడికొండ మండల పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి భూమి సేకరణలో అమరావతికి ఎంతో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, రాజధానిని అనుసంధానించే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు అవసరాల కోసం సమీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. భూసమీకరణ 2,344.12 ఎకరాలు ఉంది. అందులో పట్టా భూమి 1,654.259 ఎకరాలు ఉంది.
మిగిలి భూమిని ప్రభుత్వ భూమి ఉంది. ఈ క్రమంలో రాజధాని కనెక్టివిటీ వేగవంతం చేయడం, మౌలిక వసతుల కల్పనకు కీలకం కావడంతో భూసమీకరణ ప్రక్రియను చేపట్టింది. మోతడక గ్రామంలో ఆయా భూములు సేకరించనుంది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో భూసమీకరణ చేపడుతున్నట్లు ప్రస్తావించింది. అమరావతిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మోతడకలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
మరోవైపు రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో పౌర సౌకర్యాలు, భారీ మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.1,437 కోట్లను మంజూరు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ-CRDA 65వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ. 533 కోట్లు మౌలిక సదుపాయాల కోసం కేటాయించనున్నారు. 2014-19 మధ్య రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో రోడ్లు, వర్షపు నీటి కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల, తాగునీటి పైప్లైన్లు, వీధి దీపాలు వంటి పనులు చేపట్టనున్నారు.
అమరావతి మాదిరిగా ఆయా గ్రామాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.శాఖమూరులో కేంద్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్ఆర్ సంబంధిత భవనాల నిర్మాణానికి రూ. 596 కోట్లు విడుదల చేశారు. ఎల్పిఎస్ లేఅవుట్లలో ప్రభుత్వం తొలుత సిమెంట్-కాంక్రీట్ రోడ్లను ప్రతిపాదించింది. అమరావతిలో రానున్న రోజుల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-ఐఐటి ఖరగ్పూర్ నిర్వహించిన అధ్యయనాల తర్వాత బిటుమెన్ రోడ్లను ఎంచుకుంది ప్రభుత్వం.
ALSO READ: ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!