వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ అన్యాయంగా వేధించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ మరణించిన తర్వాత దేశం మొత్తం సాక్ష్యంగా ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎంతటి ఇబ్బందులకు గురిచేసిందో ప్రజలెవరూ మర్చిపోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్ వారసత్వం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని అంబటి విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన సీబీఐ, ఈడీ కేసులు అన్నీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా సృష్టించినవేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ కక్షతోనే దర్యాప్తు సంస్థలను ప్రయోగించారని ఆరోపించారు. జగన్ కాంగ్రెస్ చెప్పినట్లు విని ఉంటే ఈ కేసులు ఉండేవి కావని ఆ పార్టీ సీనియర్ నేతలే గతంలో ఒప్పుకున్న విషయాన్ని అంబటి ప్రస్తావించారు.
జాతీయ ప్రయోజనాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు లేదా పార్లమెంటులో కీలక బిల్లుల సమయంలో తమ పార్టీ దేశ హితం కోసమే నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ మాట మార్చలేదని వివరించారు. దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికలపై దిగజార్చేలా ఏ రాజకీయ పార్టీ ప్రవర్తించకూడదని హితవు పలికారు. అంతర్గత రాజకీయ విభేదాలు సహజమని.. అయితే విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీయడం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు..
చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చీకటి ఒప్పందాలను ఇప్పటికే తమ నేత జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారని అంబటి గుర్తు చేశారు. రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా చేతులు కలిపే నైజం కాంగ్రెస్ది అని విమర్శించారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తమ గత చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. రాజకీయ అభద్రతతో అక్రమ కేసులు పెట్టిన వారెవరో.. సూత్రాలకు కట్టుబడి నిలబడిన వారెవరో ప్రజలకు బాగా తెలుసని అంబటి రాంబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.