న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అద్భుత ఘట్టాలకు వేదికైంది. భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతమైన టెక్నాలజీని ప్రదర్శించింది. ముఖ్యంగా మహాభారత ఘట్టాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పునఃసృష్టి చేసి అక్కడకు వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణార్జునుల హోలోగ్రామ్ అవతారాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాయి.
కట్టింగ్ ఎడ్జ్ హోలోగ్రామ్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీకృష్ణుడు, అర్జునుడి ప్రతిమలు అక్కడ అద్భుతంగా కొలువుదీరాయి. ఈ డిజిటల్ అవతారాలు కేవలం బొమ్మల్లా వలే కాకుండా సందర్శకులతో నేరుగా సంభాషిస్తున్నట్టు కనబడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ క్యాప్సూల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే ఉన్న కన్సోల్ ద్వారా ప్రజలు తమకున్న డౌట్స్ ను అడగవచ్చు. ధర్మం అంటే ఏమిటి? మనకు ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరు? జీవితంలో అన్యాయంగా జరిగినప్పుడు ఏం చేయాలి? మానవులకు అతి పెద్ద ముప్పు ఏంటి? వంటి లోతైన ప్రశ్నలకు ఏఐ కృష్ణార్జునులు సమాధానాలు ఇస్తున్నారు.
ఈ ప్రదర్శనలో రిలయన్స్ రూపొందించిన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ సిరీస్ మేకింగ్ వీడియోలను కూడా ప్రదర్శించారు. ఇది పూర్తిగా ఏఐతో రూపుదిద్దుకున్న సిరీస్ కావడం గమనార్హం అని చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 17 ఎపిసోడ్లు విడుదలయ్యాయి. మన ప్రాచీన ఇతిహాసాలను నేటి తరానికి చేరువ చేసేందుకే ఈ ప్రయత్నం చేశామని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
శ్రీకృష్ణుడి ఏఐ అవతారం అత్యంత తేజోవంతంగా కనిపిస్తోంది. నీలి రంగు మేని ఛాయతో పీతాంబరాలు ధరించి తలపై నెమలి పించం ఉన్న కిరీటంతో మురళీకృష్ణుడు అలరిస్తున్నట్లు ఫోటోలో స్పష్టంగా తెలస్తుంది. అర్జునుడి రూపం ఇక్క గంభీరంగా ఉంది. వెండి రంగు దుస్తులు ధరించి చేతిలో గాండీవం పట్టుకున్న అర్జునుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. యువతతో పాటు పాత తరం వారు సైతం ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ పాత్రలను ఏ విధంగా డిజైన్ చేశారో వివరించేలా అక్కడ ఒక ప్రత్యేక వాల్ ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు జరిగే ఈ సదస్సులో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు విద్యావేత్తలు పరిశోధకులు పాల్గొంటున్నారు. రిలయన్స్ పెవిలియన్ కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. ఆరోగ్యం ఫ్యాషన్ వంటి రంగాల్లో ఏఐ ఎలా పనిచేస్తుందో వివరించే పరికరాలను కూడా ప్రదర్శనకు ఉంచారు. సాంకేతికత ద్వారా భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ వేదిక నిదర్శనంగా నిలుస్తోంది.