హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ నేరాల కట్టడికి సరికొత్త అడుగు వేసింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో చేతులు కలిపింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఒక కొత్త కార్యక్రమం ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయంతో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం కొనసాగుతున్న ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్’ ప్రచారంలో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు.
సాధారణంగా పోలీస్ హెచ్చరికలు జారీ చేస్తే.. ప్రజలు కొంత సీరియస్గా తీసుకుంటారు. అయితే.. వీటిని కొంత కామెడీగా సరళంగా చెప్పడం ద్వారా మరింత మందికి చేరువ కావచ్చని అధికారులు భావించారు. అందుకే ప్రముఖ కంటెంట్ క్రియేటర్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. వీరు రూపొందించే చిన్న వీడియోలు సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇతర వర్గాలను ఆకట్టుకోవడంలో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోంది.
ఈ ప్రచారంలో భాగంగా జీ. అలీ వంటి ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికే కొన్ని వీడియోలను విడుదల చేశారు. అలీ తన వీడియోలో ఒక నకిలీ లక్కీ డ్రా కాల్ను ఎలా ఎదుర్కోవాలో చూపించారు. మీకు 25 లక్షల రూపాయల బహుమతి వచ్చిందంటూ ఓటీపీ అడిగే మోసగాళ్ల నుంచి ఎలా జాగ్రత్త పడాలో వివరించారు. ప్రజల నుంచి ఈ వీడియోలకు విశేష స్పందన లభిస్తోంది. పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలోనూ వీటిని షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమాజంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరగాళ్లు పోలీస్ దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
కమిషనర్ సజ్జనార్ ఇతర కంటెంట్ క్రియేటర్లకు కూడా కీలక విజ్ఞప్తి చేశారు. సమాజం మీద ప్రభావం చూపగలిగే వ్యక్తులు తమ వేదికలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. సైబర్ భద్రతపై అర్థవంతమైన కంటెంట్ సృష్టించడం వల్ల ఒక సురక్షితమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదని పౌరులందరి ఉమ్మడి కర్తవ్యమని పేర్కొన్నారు.
Desi Mom vs Scammer! 🥊 Who wins? Awareness does!
While this video is hilarious, the threat is real. Cyber fraudsters use two main weapons: GREED and URGENCY to steal your OTPs.
Remember, nobody is giving away ₹25 lakh or any amount for free. There is no such thing as a free… pic.twitter.com/5NxtYWSBBh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 20, 2026
నగర పోలీస్ తీసుకున్న ఈ చొరవ వల్ల సామాన్య ప్రజలకు సైబర్ ట్రిక్స్ సులభంగా అర్థమవుతున్నాయి. సాంకేతికతను వాడుకుని కేటుగాళ్లు చేసే మోసాల పట్ల జనం అప్రమత్తం అవుతున్నారు. తక్కువ సమయంలోనే ఈ ప్రచారం క్షేత్రస్థాయికి చేరుకోవడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని వినూత్న పద్ధతుల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతామని వెల్లడించారు.