Canara Bank Robbery Case: అనకాపల్లి కెనరా బ్యాంక్లో జరిగిన దోపిడీ యత్నం కేసులో.. పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన దొంగలను పట్టుకోవడమే లక్ష్యంగా.. పలు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును అనకాపల్లి అడిషనల్ ఎస్పీ మోహన్రావు స్వయంగా పర్యవేక్షిస్తుండగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దొంగల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తున్నారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. కెనరా బ్యాంక్ దోపిడీ యత్నానికి మొత్తం ఏడుగురు దొంగలు మూడు బైకులపై వచ్చారు. దోపిడీకి ముందు చాలా ప్లాన్తో బ్యాంక్ను రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఒక దొంగ బ్యాంకులోకి వెళ్లి అకౌంట్ తెరవాలంటూ సిబ్బందిని అడిగి పరిస్థితిని గమనించాడు. అతను బయటకు వెళ్లిన పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు దొంగలు బ్యాంక్లోకి ప్రవేశించారు. ఈ సమయంలో మరో ఇద్దరు దొంగలు నేరుగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్లారు.
బ్యాంక్ లోపల మొత్తం ముగ్గురు దొంగలు ఉండగా, మరో ఇద్దరు మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లి బ్రాంచ్ మేనేజర్ను తుపాకీతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో క్యాషియర్ కాలర్ పట్టుకుని ఇద్దరు దొంగలు తుపాకీ చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. బ్యాంక్ సిబ్బంది భయభ్రాంతులకు గురైనప్పటికీ, బ్రాంచ్ మేనేజర్ ధైర్యంగా అలారం మోగించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అలారం మోగిన వెంటనే బ్యాంకు చుట్టుపక్కల ఉన్నవారు అప్రమత్తం కావడంతో పాటు, పోలీసులు వచ్చే అవకాశముందని భావించిన దొంగలు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంకు బయట కాపలా కాసిన ఇద్దరు దొంగలతో కలిసి మొత్తం ఏడుగురు దొంగలు మూడు బైకులపై వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. దొంగతనం పూర్తిగా విఫలమవడంతో వారు రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు ముఖాలకు మాస్కులు కూడా ధరించకపోవడం దర్యాప్తుకు కీలకంగా మారింది. బ్యాంక్లోని సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు చుట్టుపక్కల రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ముఖాలు, బైక్ నంబర్లపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో దొంగల ఆచూకీని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు తుమ్మపాల మీదుగా చోడవరం వైపు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను సేకరించి విచారిస్తున్నారు.
Also Read: ప్రేమకోసం ఇస్లాంలోకి.. పాక్ అనుకూల నినాదాలతో హల్చల్.. యువకుడు అరెస్ట్
ఈ కేసుపై అడిషనల్ ఎస్పీ మోహన్రావు మాట్లాడుతూ.. దోపిడీ యత్నానికి పాల్పడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగల కదలికలపై పూర్తి సమాచారం సేకరించామని, ఎలాంటి ఆధారాలు దొంగలకు అనుకూలంగా మిగలకుండా దర్యాప్తు సాగుతుందని తెలిపారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సమాచారం గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.