Kadiri News: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారంతో మతం మారిన ఓ యువకుడు.. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో.. అరెస్టైన వ్యక్తి ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్. అతడు దేవిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ధనుంజయ్ గోర్లవాండ్లపల్లికి చెందిన ఓ ముస్లిం యువతిని ప్రేమించినట్లు విచారణలో తేలింది. ఆమెతో వివాహం చేసుకోవాలంటే మతం మారాల్సిందేనని ఆమె కుటుంబ సభ్యులు షరతు పెట్టడంతో.. ధనుంజయ్ ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఆసిఫ్ అలియాస్ ధనుంజయ్ తిరుపతికి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద.. కారు అద్దెకు తీసుకుని డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక రోజు ప్రయాణ సమయంలో కారుకు ముందు టైరు పేలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు మరమ్మతులకు వచ్చిన ఖర్చు, అద్దె సొమ్ము కలిపి మొత్తం రూ.15 వేలు చెల్లించాలని ప్రసన్నకుమార్ రెడ్డి ధనుంజయ్ను కోరాడు.
ఈ ఏడాది మార్చి నెలలో ప్రసన్నకుమార్ రెడ్డి, అతని స్నేహితుడు అరవింద్ కలిసి.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వైట్ఫీల్డ్ ప్రాంతంలో ధనుంజయ్ను నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ముస్లింల వల్ల దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి. నువ్వు కూడా ముస్లింవే అంటూ ప్రసన్న రెడ్డి ధనుంజయ్ను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. ఈ మాటలతో సహనం కోల్పోయిన ధనుంజయ్ తీవ్ర ఆవేశానికి లోనై ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు.
ఈ ఘటనను ప్రసన్నకుమార్ రెడ్డి తన సెల్ఫోన్లో వీడియోగా రికార్డు చేశాడు. ఆ వీడియోను ఈ నెల 2వ తేదీన ‘ప్యూర్ ఫ్యాక్ట్’ అనే ఇన్స్టాగ్రామ్ ఐడీలో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంపై స్థానికులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
వీడియో వైరల్ కావడంతో నల్లచెరువు పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ప్రామాణికతను పరిశీలించిన అనంతరం గురువారం ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఆసిఫ్ అలియాస్ ధనుంజయ్పై Cr.No.76/2025 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 196(1)(a), 299, 353(2)తో పాటు.. IT Act 2000-2008లోని సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో విద్వేషపూరిత కంటెంట్ వ్యాప్తి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికారులు స్పందిస్తూ.. దేశ వ్యతిరేక నినాదాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా చట్టవిరుద్ధమైన కంటెంట్ను పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.