jogulamba gadwal district: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి తాళి కట్టిన భర్తే కాలయముడిగా మారి, కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడు. నిందితుడు కుర్వ గోవిందు, అదే గ్రామానికి చెందిన జమ్ములమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో గురువారం రాత్రి ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ తమ నివాసంలో నిద్రిస్తున్న సమయంలో గోవిందు జమ్ములమ్మపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు తలుపులు తీసి చూడగా, తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీసింది. అయితే, వదిలిపెట్టని నిందితుడు ఆమెను వెంబడించి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ దాడిలో తండ్రిని అడ్డుకోబోయిన కుమారుడికి కూడా గాయాలయ్యాయి.
నిందితుడైన కుర్వ గోవిందు గత చరిత్ర చూస్తే అతను నేర ప్రవృత్తి, మానసిక అస్థిరత కలిగిన వ్యక్తిగా తెలుస్తోంది. గతంలో సొంత తల్లిదండ్రులపైనే హత్యాయత్నం చేసిన కేసులో అతను జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా, కొంతకాలం పాటు హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందినట్లు సమాచారం. నిందితుడి మొదటి భార్య కూడా ఇదివరకే మృతి చెందగా, జమ్ములమ్మతో అతనికి రెండో వివాహం జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం లేదా పాత నేర ప్రవృత్తి మళ్లీ పెచ్చరిల్లడం ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.
Also Read: ఆకాశం నుంచి నేలకు.. భారీగా పతనమైన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే తల్లి ప్రాణాలు కోల్పోవడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.