AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రంప చోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 5 రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఏపీలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్రెడ్డి, నిమ్మల రామానాయుడుతో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశం అయ్యారు. జిల్లాల పునర్విభజనపై ఇటీవల ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. జిల్లాల విభజనపై అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా వరుస సమీక్ష చేస్తున్నారు.
ఈ క్రమంలో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలకు ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మరింత పెద్దదిగా తయారవుతుందని ఈ ప్రతిపాదనను సీఎం ఆమోదం తెలిపారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. తాజా సమీక్షలో కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం ఫైనల్ చేశారు.
Also Read: AP Rains: బంగాళాఖాతంలో మరో తుపాన్.. నవంబర్ 29 నుంచి వర్షాలు.. రైతులకు అలర్ట్
మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు జిల్లాల రూపకల్పనలో ప్రజలకు, పరిపాలనకు ఇబ్బందులు కలగకుండా మార్పులు, చేర్పులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిపాలనా యంత్రాంగం, రెవెన్యూ విభజనపై దృష్టి సారించాలని మంత్రులను ఆదేశించారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా సమగ్రంగా చర్చించారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.