AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. రాగల ఆరు గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
అనంతరం 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని వివరించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇటీవలి మొంథా తుపాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీగా పంట నష్టం జరిగింది. మొంథా తుపాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదనలో ఉన్నారు. ఇంతలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి తుపాన్గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తుంది. తుపాన్గా ఏర్పడిన తర్వాతా దానికి సెన్యార్గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది.
వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి తర్వాత తుపాన్గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. శ్రీలంకకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తుపాన్ గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పంటలు కోత దశలో ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించింది.
తుపాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, రానున్న 48 గంటల్లో తుపాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.