Varahi Declaration: తిరుపతి వారాహి సభ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్.. సనాతన ధర్మ పరిరక్షణకై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షను విజయవంతంగా సాగించిన పవన్.. తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం గుండా.. కాలినడక ద్వారా చేరుకొని కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేసిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో తిరుపతిలో వారాహి బహిరంగ సభను గురువారం నిర్వహించి వారాహి డిక్లరేషన్ ను పవన్ ప్రకటించారు. పవన్ మాట్లాడుతూ.. తాను తిరుపతి శ్రీవారి సన్నిధి నుండి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు.. కాశీ నుండి కన్యాకుమారి వరకు ఒకే జాతి, ఒకే మాట, ఒకటే భేదం లేకుండా మాట్లాడాలన్నారు. అలాగే డిక్లరేషన్ పుస్తకంలోని 7 అంశాలను కూడా పవన్ సభలో ప్రస్తావించారు.
వారాహి డిక్లరేషన్ అంశాలు ఇవే..
ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉందని, దాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలని, సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలంటూ హిందూ ధార్మిక సంస్థలకు పిలుపునిచ్చారు.
అలాగే చివరగా పవన్ మాట్లాడుతూ.. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటారని, రాముడు ఈ దేశానికి ఆదర్శ ప్రాయుడని, హిందువుల వారసత్వ సంపదగా పవన్ అన్నారు.
ఈ సభకు భారీ ఎత్తున ప్రజానీకం, జనసైనికులు, వీర మహిళలు తరలి వచ్చారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. కాగా పవన్ తన డిక్లరేషన్లో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారోనన్న చర్చకు పవన్ డిక్లరేషన్ ప్రకటనతో తెర పడింది. కాగా.. దీక్ష చేపట్టి డిక్లరేషన్ ప్రకటించి.. సనాతన ధర్మ పరిరక్షణకు తానెప్పుడూ ముందుటాను అంటూ ప్రకటించిన పవన్ కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.