Ap Govt: ఆరోగ్యం రంగంపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఒక విధంగా చెప్పాలంటే డోలీ సమస్యలకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. డ్రోన్ల ద్వారా వైద్య సర్వీసులు మొదలు పెట్టాలని ఆలోచన చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలల నుంచి అమల్లోకి రానుంది.
ఏపీలో తొలి అడుగు.. వచ్చేనెల నుంచి
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యం దృష్టి పెట్టింది. ఏయే జిల్లాల్లో ప్రజలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అనేదానిపై సర్వే చేయించింది. ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్యతో ప్రజలు బాధపడుతున్నట్లు తేలింది. దీనికి సంబంధించి ఆ మధ్య సర్వేని బయటపెట్టారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ‘సంజీవిని’ పేరుతో ప్రజల మెడికల్ రికార్డులను డిజిటల్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కుప్పం నియోజకవర్గంలో జరుగుతోంది.
ఇది కేవలం నగరాలు, పట్టణాలు, పల్లెటూర్లకు మాత్రమే. ఇప్పటికే మారుమూల పల్లెటూర్లలో వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. చాలామంది డోలీలను నమ్ముకుంటున్నారు. మారమూల ప్రాంతాల నుంచి రోగులను కనీసం పీహెచ్సీకి తీసుకొచ్చేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో చాలామంది మృత్యువాత పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
గిరిజన గ్రామాలకు డ్రోన్ ద్వారా వైద్యం
వైద్య సేవలకు టెక్నాలజీ జోడిస్తే ఎలా ఉంటుందని కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మెడికల్ సర్వీసులు మొదలు పెట్టాలని భావిస్తోంది. మెడిసిన్, బ్లడ్ యూనిట్లు ఆయా ప్రాంతాలకు అందించాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నుంచి జనవరి నుంచి ఈ తరహా డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. రెడ్ వింగ్ సంస్థ- ఏపీ వైద్య శాఖ మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకుంది. వైద్య శాఖ కమిషనర్ వీరపాండియన్– రెడ్వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య ఒప్పందం జరిగింది.
ALSO READ: ఏపీలో ఫోన్లు చేసి బెదిరింపులా? తగ్గేది లేదన్న జగన్, చేసి తీరుతామన్న సీఎం
ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కిందఆరు నెలలపాటు ఉచితంగా సేవలు అందించడానికి ముందు కొచ్చింది ఆ సంస్థ. పాడేరు కేంద్రంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని పీహెచ్సీలు, సీహెచ్సీలకు డ్రోన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో విశాఖ కేజీహెచ్ నుంచి నేరుగా పాడేరుకు మందుల రవాణాకు డ్రోన్లను వినియోగించాలన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన.
రెడ్ వింగ్ సంస్థ ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్లో ఆ తరహా సేవలను అందిస్తోంది. దీనికి సంబంధించి కొద్దిరోజుల కిందట నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. పాడేరు నుంచి తాజంగి ప్రాంతానికి డ్రోన్ ద్వారా మందులు తరలించారు. డ్రోన్ వ్యవస్థ విజయవంతం అయితే గిరిజన ప్రాంతంలో వైద్యసేవల విషయంలో పెను మార్పులు రావడం ఖాయమని అంటున్నారు.