Road Accident: హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయభేరి కాలనీలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాధు వాస్వానీ స్కూల్కు చెందిన స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకు రోడ్డుపై పడిపోయారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బాలుడు కొంతదూరం వరకు బస్సు కింద ఇరుక్కొని ఈడ్చుకెళ్లబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ బాలుడికి ప్రాణాపాయం తప్పినా, తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియో ఫుటేజ్లో బస్సు వేగంగా రావడం, బైక్ను ఢీకొట్టడం, ఆ తర్వాత కూడా ఆగకుండా వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన అంశంపై విచారణ చేపట్టారు. స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో స్కూల్ బస్సుల వేగ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Shamshabad Crime: శంషాబాద్లో దారుణం.. బైక్పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి..