Political Survey: ప్రస్తుతం ఏపీలో అధికార టీడీపీ (TDP), విపక్ష వైసీపీ (YSRCP) మధ్య థగ్ ఆఫ్ వార్ (Thug Of War) నడుస్తోంది. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ (Jagan Mohan Reddy) సహా ఆ పార్టీ నేతలు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) సీఎం చంద్రబాబును దూషించడం.. ఏపీలో హింసాత్మక పరిస్థితులకు దారి తీశాయి. అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటిపై పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. అనంతరం నారా లోకేష్ (Nara Lokesh)ను అభ్యంతరకర మాటలు అన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని సైతం తగలబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్న ఏపీ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారన్న అంశం ప్రస్తుతం చర్చకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి ఆసక్తికర సర్వే బయటకొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో ఆ సర్వే స్పష్టంగా తెలియజేసింది.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టూడే (India Today) ఎప్పటికప్పుడు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood Of The Nation) పేరుతో సర్వేలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రజల నాడీ ఎలా ఉందన్న దానిపై సర్వే నిర్వహించింది. 2024లో కూటమి పార్టీలకు (టీడీపీ + జనసేన + బీజేపీ) 51 శాతం ఓట్లు రాగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లేటెస్ట్ సర్వే ప్రకారం 53 శాతం ఓట్లు కూటమికి వస్తాయని తేలింది. అయితే కేవలం పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రమే ఈ సర్వే జరగడం గమనార్హం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలకు గానూ 22-24 స్థానాలను కూటమి సొంతం చేసుకుంటుందని అభిప్రాయపడింది. ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీకి వచ్చిన ఫలితాలు చూస్తే.. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఓవరాల్ గా 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వైసీపీకి చెంపపెట్టు లాంటి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే.. వైసీపీ ఓటు 2024లో వచ్చిన 40 శాతం నుంచి 39 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఫలితంగా 3-4 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించవచ్చని సర్వేలో వెల్లడైంది. సూపర్ సిక్స్ (Super Six) హామీల అమలు, రాజధాని అమరావతి (Amaravati Capital) పనుల్లో వేగం, విశాఖపట్టణానికి గూగుల్ వంటి పలు అంతర్జాతీయ సంస్థల రాక నేపథ్యంలో ప్రజలు కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.
Also Read: Nagababu: మాజీ సీఎం జగన్ని తొలిసారి ఏకేసిన నాగబాబు.. అన్నికోణాల్లో కూడా, పాయింట్ టు పాయింట్
ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇచ్చిన సర్వేను పూర్తిస్థాయిలో విశ్వసించడం కష్టమేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సర్వే కేవలం పార్లమెంటు ఎన్నికలు, ప్రధాని మోదీ (PM Modi) మేనియాను పరిగణలోకి తీసుకొని మాత్రమే జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సర్వే గతంలోనే జరిగి ఉంటుందని.. అంబటి అరెస్టు అనంతర పరిణామాలతో ఈ సర్వేకు సంబంధం లేకుండా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జగన్ పాలనలో జరిగిన అరాచకాలకు చెక్ పెట్టి.. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. సీఎం చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులైన నేత ఈ తరహా ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంపై ఏపీ ప్రజలు సైతం అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెుత్తం మీద ఇండియా టూడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏపీలో పెద్ద చర్చకే కారణమైందని చెప్పవచ్చు.
Also Read: Kavitha Effect on BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కొత్త సవాల్.. కవిత ఎదుగుదలే గులాబీకి ముప్పా?