AP Schools Holiday: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు ఏపీలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామని తెలిపారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో గురువారం(అక్టోబర్ 23) నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి, పుత్తూరు, నగరి, తిరుమల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు కాకినాడ, రాజమండ్రి ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరంతరంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అలాగే వైయస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు అక్టోబర్ 23, 2025 న సెలవు దినంగా ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు రేపు సెలవు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న క్రమంలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్ని మాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలుపంచుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.