Vijayawada At Home Event: ఏపీలో ఏం జరుగుతోంది? వైసీపీకి సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారా? కొన్నాళ్లుగా సీనియర్ నేత బొత్స తో గ్యాప్ పెరిగిందా? లోక్ భవన్లో మంత్రి లోకేష్-బొత్స మధ్య సంభాషణ వెనుక ఏం జరుగుతోంది? వైసీపీ నేతలు ఎందుకు ఆరా తీస్తున్నారు? అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
విజయవాడలో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం
రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వాహించారు. ఇలాంటి కార్యక్రమానికి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
వైసీపీ నుంచి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ప్రత్యేకంగా మంత్రి లోకేష్.. గవర్నర్ తోపాటు ఇతర ప్రముఖుల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. లోక్భవన్ ప్రాంగణంలో ప్రధాన వేదిక వద్దకు వెళ్తున్న వారిని పలకరిస్తూ ముందుకు సాగారు మంత్రి లోకేష్.
లోకేశ్-బొత్స మధ్య చర్చపై వైసీపీ ఆరా
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కనిపించడంతో కాసేపు ఆగారు మంత్రి లోకేష్. కరచాలనం చేస్తూ బాగున్నారా అని బొత్సను లోకేష్ పలకరించారు. అటు బొత్స కూడా నవ్వుతూ లోకేశ్ భుజం తడుతూ పలకరించారు. ఇద్దరు నేతలు చేతిలో చేయి వేసుకుని నవ్వుతూ కుశల ప్రశ్నలు వేసుకుని చాలా సేపు మాట్లాడుకున్నారు.
ఆ సన్నివేశం ఏపీలో రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. అక్కడే ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఉన్నారు. లోకేష్తో ఆయన కూడా కాసేపు మాట్లాడారు. కొద్దిసేపటి తర్వాత బొత్స అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై వైసీపీ నేతలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ బొత్స-లోకేష్ మధ్య ఎలాంటి చర్చ జరిగింది? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
బొత్సతోపాటు పలువురు ఎమ్మెల్సీలు కూటమి వైపు వెళ్లాలని భావించినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు. తాజాగా మంత్రి లోకేష్-బొత్స సంభాషణపై ఎమ్మెల్సీలంతా టచ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. జరుగుతున్న పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. రానున్న రోజుల్లో వీరి భేటీ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.