Avinash Reddy Latest News(Andhra Pradesh News): అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. సీబీఐను 4రోజుల గడవు కోరారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి కడప జిల్లాకు అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాతే విచారణకు వస్తానని సీబీఐకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అవినాష్ రిక్వెస్ట్కు సీబీఐ ఓకే చేసింది. ఆయన కోరినట్టే 4 రోజుల గడువు ఇచ్చింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించింది. అయితే గత 20 రోజులుగా ఈ కేసు విచారణ చేపట్టలేదు.
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి పాత్ర, ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్రెడ్డి విచారణపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలికంగా సీబీఐ విరామిచ్చింది. ఆ సమయంలో డిల్లీ వెళ్లిన సీబీఐ బృందం సోమవారమే తిరిగి హైదరాబాద్కు చేరుకుంది.
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అప్పుడే అరెస్ట్ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ సీబీఐ మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. కానీ అవినాష్ రెడ్డి విచారణ హాజరుకాకుండా గడువు కోరారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది సీబీఐ. ఆయన కోరినట్టే 4 రోజుల గడువిస్తూ.. ఈ నెల 19న విచారణకు రావాలంటూ మళ్లీ నోటీసులు ఇచ్చింది.