Chandrababu comments on containers(AP politics): ఏపీలో కంటెయినర్ల వ్యవహారం ముదిరిపాకాన పడింది. ఎన్నికల వేళ పార్టీలకు ముఖ్యంగా విపక్ష టీడీపీకి అస్త్రంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నోరు విప్పారు. కంటెయినర్లో అవినీతి డబ్బులు ఉన్నాయని ఆరోపించారు. మద్యం, ఇసుక వివిధ విభాగాల్లో కూడబెట్టిన నగదని అన్నారు. వైసీపీ నేతలైతే కంటెయినర్లో ఉన్నది వంట సామాగ్రి అని కొంతమంది చెబుతున్నారని అన్నారు. ఇంకొందరైతే ఫర్నీచర్ అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేశారని ఘాటుగా విమర్శించారు.
ఇంతకీ ఈ కంటెయినర్ల వ్యవహారం ఏంటి? మంగళవారం సీఎం జగన్ ఆఫీసుకు ఓ కంటెయినర్ వచ్చింది. దానికి పోలీసు స్టిక్కర్ ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి అది ఆర్టీసీ వాహనంగా భావిస్తున్నారు. ఆ కంటెయి నర్ సీఎం క్యాంపు ఆఫీసు లోపలికి వెళ్లి వస్తువుల్ని దింపడమో లేక లోడ్ చేసుకుని వెళ్లడమో జరిగింది. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రజాగళం యాత్రంలో చంద్రబాబు కంటెయినర్ల వ్యవహారంతోపాటు మరికొన్ని అంశాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.
సీఎం జగన్ జానాల్లోకి రావడంతో ప్రజలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. చిన్నాన్నను చంపి.. చెల్లిని జైలుకు పంపాలని ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హత్య చేయించిన వారికే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసం కోడికత్తి డ్రామాలు ఆడారని చురక అంటించారు. రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీయేనని అన్నారు. సంపదను సృష్టించడమే టీడీపీ ధ్యేయమన్నారు. తమ హయాంలో పోలవరం 70శాతం పూర్తి అయితే వైసీపీ వచ్చిన తర్వాత దాని నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఏపీకి రాజధానిని లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్ అని ఆరోపించారు.