CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్లో భాగంగా కేవలం 8 గంటలు మాత్రమే ఆయన అక్కడ గడపనున్నారు. ఈ భేటీలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాత్రికి హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత అమరావతికి తిరిగి రానున్నారు.
సాయంత్రం ఢిల్లీకి సీఎ చంద్రబాబు
ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏంటి? నెల రోజుల వ్యవధిలో రెండోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట పట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? కొందరేమో అమరావతి వ్యవహారమని, ఇంకొందరు నిధుల కోసమని, మరికొందరు మాత్రం రాబోయే కంపెనీలకు ప్రోత్సాహకాలు కోసం వెళ్తున్నారని అంటున్నారు.
బుధవారం సాయంత్రం మూడున్నర గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. దాని తర్వాత అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది. రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి బయలు దేరతారు ముఖ్యమంత్రి.
కేవలం 8 గంటలు మాత్రమే అక్కడ
రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్ మీటింగ్ ఉండనుంది. అందులో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి రాత్రి 11 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి విజయవాడకు రానున్నారు. అయితే పొగమంచు కారణంగా రాత్రికి అక్కడే ఉండి ఉదయం వస్తారా? లేకుంటే అక్కడే ఉండనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.
ఢిల్లీ టూర్లో ప్రాజెక్టులు, నిధులు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల మాట. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ రానుంది.
ALSO READ: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ప్రస్తుతం బడ్జెట్పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో కేంద్రం నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీల కోసం ప్రొత్సాహకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లండన్ వెళ్లిన సీఎం చంద్రబాబు, అక్కడ విమానాల తయారీ కంపెనీలతో మంతనాలు జరిపినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశముంది.
హౌసింగ్తోపాటు రైల్ కనెక్టివిటీ గురించి షాతో భేటీలో కొత్త ప్రతిపాదనలు అందించే అవకాశం ఉన్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతికి చట్టబద్దతపై బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేసే అవకాశముంది. ఇటీవల ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా మీడియా ముందు చెప్పారు.
కాకపోతే చట్ట బద్దత ఎప్పటి నుంచి నుంచి ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన 2024 నుంచి ఏపీ రాజధానిగా అమరావతికి చట్ట బద్దత కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకురానుంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు సర్కార్.. కేంద్రంతో చర్చలు జరిపింది.
2014-24 వరకు హైదరాబాద్ ఇరు రాష్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. 2024 జూన్ 2 తర్వాత అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టనుంది. దీనివల్ల రాజధాని రైతులకు భరోసా కలగనుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అమరావతి రాజధానిగా ఉండనుంది. దీనికితోడు జమిలి ఎన్నికలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.