పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ వాతలు పెడుతోంది. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదని సంకేతాలు పంపుతోంది. ఓ చిన్నారెడ్డి, ఓ కొండా సురేఖలపై వేటు వేసిన ఉదంతం.. ఒక్క తెలంగాణకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదో వార్నింగ్ సిగ్నల్గా పంపాలనుకుంటోంది AICC.
ఉన్నది ఇంకా రెండేండ్లు.. బలమైన ప్రతిపక్షం.. పుంజుకుంటున్న బీజేపీ.. ట్రయాంగిల్ పోరు తప్పేలాలేదు. ఈ క్రమంలో సొంతింట్లో కుంపట్లకు ఇక చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యింది అధిష్టానం.
అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ నిర్ణయించుకున్నట్టు కూడా అర్థమవుతోంది. రేవంత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో రేవంత్ భుజానేసుకుని పార్టీని విజయ తీరాలకు చేర్చాలంటే.. అసమ్మతి గళాలకు చెక్ పెట్టాలనే కొత్త వ్యూహంతో ముందుకు పోతోంది కాంగ్రెస్ అధిష్టానం. మరి హైకమాండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వర్కౌట్ అవుతుందా..?
కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్ అయింది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు, పరిణామాల విషయంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరించింది. ఓవరాక్షన్ చేసినా, పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా మాట్లాడితే ఎంతటి వారైనా చర్యలు ఎదుర్కోవాల్సిందే అని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పకనే చెప్పింది. కొండా సురేఖను పదవి నుంచి తప్పించే నిర్ణయం పార్టీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్తో పాటు తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెపై చర్యలు తీసుకోవాలని గాంధీభవన్ వేదికగా ప్రెస్మీట్ పెట్టి మరీ పార్టీకి విజ్ఞప్తి చేశారు.
సుస్మిత వ్యాఖ్యలను వ్యక్తిగతమని పేర్కొంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఎక్కడ చేశారు…? ఏ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు…? ఎవరి అండ చూసుకుని ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు…? ఈ ప్రశ్నలకు ఆమె స్పందించకపోయినా… తల్లి, తండ్రిని చూసుకుంటారన్న అండతోనే సుష్మిత ఈ వ్యాఖ్యలు చేశారన్నది బహిరంగ రహస్యమే. తన కూతురు ఆరోపణల్ని వ్యక్తిగత వ్యాఖ్యలుగా చెప్పినా… అవి పార్టీకి, ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే స్థాయికి వెళ్లడంలో బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న వచ్చింది..
ఇకపై ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే ముందుగా వివరణ… ఆ తర్వాత చర్యలు తప్పవన్న క్లియర్ కట్ మెసేజ్ కాంగ్రెస్ ఇచ్చేసింది. మంత్రిగా ఉన్న కొండా సురేఖ విషయంలోనే వెనక్కి తగ్గలేదని… ఇక మిగతా వారి విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే ఉంటుందని పార్టీ అధిష్ఠానం చెప్పకనే చెప్పింది.