Heavy Rains: అయ్యబాబోయ్.. మళ్లీ వర్షాలు.. ఒకపక్క చలి.. మరోపక్క వర్షాలు.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. IMD నివేదిక ప్రకారం, ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందనుంది.
రానున్న 48 గంటల్లో ఇది మరింత శక్తిని పుంజుకుని తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ, దీని ప్రధాన దిశ తమిళనాడు వైపు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం నామమాత్రంగానే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం నెలకొంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే, ఉపరితల గాలుల ప్రభావంతో తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, లోతట్టు జిల్లాల్లో విజిబులిటీ తగ్గి, వాహన దారులకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల వల్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శనివారం నాటికి వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణమే కొనసాగినప్పటికీ, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాతావరణంలో తేమ పెరిగి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వీచే తూర్పు గాలుల వల్ల వాతావరణంలో తేమ శాతం పెరిగి, కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టవచ్చని అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్లో యువతి బలి!
అంతేకాకుండా వాయుగుండం తమిళనాడు తీరం దాటిన తర్వాత మళ్లీ ఉత్తర భారతం నుండి వీచే చలి గాలులు పెరిగి, తిరిగి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.