Andhra News: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తనపై భౌతిక దాడులు చేస్తామంటూ వస్తున్న హెచ్చరికలపై మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను కొడతాం, నరికేస్తాం అని ప్రగల్భాలు పలికారు కదా.. అందుకే మీరు చెప్పిన చోటికే వచ్చాను, ఏం చేస్తారో చేసుకోండి” అంటూ నిమ్మాడ సెంటర్లో నిలబడి ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి నేరుగా పలసకు చేరుకున్న ఆయన, అర్ధరాత్రి వేళ హైవేపై హల్చల్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
తనను భయపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగానే అప్పన్న అనే వ్యక్తితో తనకు ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడ్డారని దువ్వాడ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను దేనికీ బెదిరే రకం కాదని, ప్రాణం పోయినా ప్రశ్నించడం ఆపబోనని స్పష్టం చేశారు. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయపోరాటంతో పాటు మీడియా వేదికగా నిజాలను బయటపెడతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి
ఈ వివాదానికి కేంద్ర బిందువుగా దివ్వెల మాధురి విడుదల చేసిన ఒక ఆడియో రికార్డింగ్ నిలిచింది. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్నకు, మాధురికి మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియోలో.. శ్రీనివాస్పై దాడికి ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం ఉంది. నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగే అవకాశం ఉందని అప్పన్న హెచ్చరించినట్లు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన దువ్వాడ, ముందస్తుగా స్పందించి ప్రత్యర్థుల ఇలాకాలోనే సవాల్ విసరడం గమనార్హం.
అంతేకాకుండా వైసీపీ అధిష్టానం తనపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల పట్ల కూడా దువ్వాడ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలనుకుంటే శాశ్వతంగా బహిష్కరించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పదవుల కంటే తనకు ప్రజల సమస్యలే ముఖ్యమని, తన గళాన్ని ఎవరూ నొక్కలేరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ భౌతిక దాడులతో భయపెట్టాలనుకోవడం పిరికిపంద చర్య అని ఆయన విమర్శించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 50 వెహికల్స్ ధ్వంసం.. మంటల్లో అనేక మంది!
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ వర్సెస్ అచ్చెన్నాయుడు, కృష్ణదాస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. అర్ధరాత్రి హైవేపై దువ్వాడ చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి
ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య సంభాషణ
శ్రీనివాస్పై దాడికి ప్లాన్ జరుగుతుందని చెబుతున్న అప్పన్న
నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్లో దాడి జరుగుతుందన్న అప్పన్న
దమ్ముంటే కొట్టాలని అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై… https://t.co/POWdIxrv5r pic.twitter.com/jKEVDGBTol
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025