AP Liquor Case: వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందా? లిక్కర్ కేసులో అసలు నిందితుల పుట్ట పగులుతుందా? ఇప్పటివరకు సిట్ దర్యాప్తు చేస్తుండగా, ఇప్పుడు ఈడీ కూడా ఎంటరైంది. ఢిల్లీ లిక్కర్ కేసు మాదిరిగానే.. ఏపీ లిక్కర్ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేస్తుందా? వారిని తీహార్ జైలుకి తరలిస్తుందా? నెక్ట్స్ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతోందా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.
ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేసిందంటే కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈడీ ఎంటరయ్యిందంటే తీహార్ జైలు వరకు వెళ్తుందని అంటున్నారు కొందరు నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితలతోపాటు వివిధ రాష్ట్రాల నేతలను తీహార్ జైలుకి పంపింది. చత్తీస్ఘడ్ లిక్కర్ స్కామ్లో అక్కడి కీలక నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ నేతలు.
ఈడీ కేవలం ఆ అంశాలపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. మనీ లాండరింగ్ కోణం, ముడుపుల ద్వారా వచ్చిన నిధులను షెల్ కంపెనీలకు తరలించడం, హవాలా ద్వారా ఇతర దేశాలకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడింటిపైనే ఈడీ ఫోకస్ చేసినట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి. రెండురోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ టీమ్.. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత సోదాలు చేయడం మొదలుపెట్టింది.
లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్, బెంగుళూరు కేంద్రంగా జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో నాలుగు బంగారం షాపుల నుంచి గోల్డ్ కొనుగోలు చేసినట్టు నకిలీ ఇన్ వాయిస్లను సృష్టించారట. రాజ్ కసిరెడ్డి, గోవిందప్పలకు హైదరాబాద్లో ఉన్న షెల్ కంపెనీలతో సన్నిహితంగా ఉంటూ నిధులను వాటికి తరలించినట్టు వార్తలు లేకపోలేదు.
ALSO READ: సెప్టెంబర్ 18 నుంచి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
ఢిల్లీ, చత్తీస్గఢ్ లిక్కర్ కేసుల్లో సీబీఐ కంటే ముందు ఈడీ రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేసి జైలుకి పంపించింది. సిట్ కంటే ముందు ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయనుందా? ఈ కేసులో వెలుగులోకి రాని అంశాలను బయటకు తీసి వారిని అరెస్టు చేస్తుందా? అనేదానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అంతిమంగా లబ్దిపొందినవారు ఎవరు? అనేది ఈడీ తేల్చనుంది.
మరోవైపు ఉపరాష్ల్రపతి ఎన్నిక ఉండడంతో ఈడీ ఎంటర్ కావడం ఆలస్యమైందని అంటున్నారు కొందరు నేతలు. డిస్టలరీస్ల నుంచి ఆర్డర్లు వచ్చినందుకు చాలామంది ముడుపులు ఇచ్చారు. వారి ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం నుంచి సోదాలు చేస్తోంది ఈడీ. నాలుగైదు డిస్టలరీస్, గోల్డ్ మర్చెంట్ ఇళ్లలోనూ సోదాలు చేసింది ఈడీ.
అన్నట్లు ముడుపుల ద్వారా సేకరించిన నిధులతో ఒకానొక దశలో యూకెలో ఓ బ్యాంకును కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్టు కొందరి నేతల మాట. మరోవైపు లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేస్తున్న విషయం తెలియగానే తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కిపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులతో కీలక నేత చర్చించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి లిక్కర్ సెగ వైసీపీకి గట్టిగానే తగిలినట్టు కనిపిస్తోంది.