AP News: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్ ప్రజల ఆశలను నీరుగార్చిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బడ్జెట్లో అటు అభివృద్ధి గానీ, ఇటు సంక్షేమం గానీ ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. కేవలం అంకెలకు పరిమితమైన ఈ బడ్జెట్ ద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని, రాష్ట్ర ప్రగతిని ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలకు కోత
ప్రభుత్వం సామాజిక పెన్షన్ల విషయంలో అమానవీయంగా వ్యవహరిస్తోందని రాచమల్లు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది లబ్ధిదారుల పెన్షన్లను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను నమ్మించి వంచించడమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.
విపత్తు నిర్వహణలో వైఫల్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నాలుగు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొందని, కానీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఏమాత్రం చొరవ చూపలేదని రాచమల్లు విమర్శించారు. కనీసం ఒక్క బాధితుడికి కూడా సరైన పరిహారం అందలేదని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉంటే, ప్రభుత్వం మాత్రం సహాయక చర్యలను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు.
రైతాంగ సమస్యలు – మద్దతు ధర
వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతను ఆయన ఎండగట్టారు. రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు పంట బీమా కల్పించేందుకు అవసరమైన జీవోను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
విద్యార్థులు, ఉద్యోగుల వంచన
విద్యార్థులకు భరోసానిచ్చే ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకాన్ని ప్రభుత్వం దాదాపుగా అటకెక్కించిందని రాచమల్లు విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థుల ఉన్నత చదువులు భారంగా మారతాయని ఆందోళన చెందారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని, అలాగే ఉద్యోగులకు రావాల్సిన PRC, ఇతర అలవెన్సులను చెల్లించకుండా వారిని కూడా మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: రాజకీయాలకు లక్ష్మీనారాయణ గుడ్ బై? మళ్లీ ఉద్యోగంలోకి..!
ఘాటు సవాల్
ప్రజలను మాయమాటలతో నమ్మించి అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారి గొంతు కోస్తోందని రాచమల్లు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తే, తాను ఈ రాష్ట్రంలోనే ఉండబోనని ఆయన అత్యంత ఘాటుగా సవాల్ విసిరారు.