BigTV English

MLA vs RDO:ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన ఆర్డీఓ.. టిక్కెట్ ఎవరికి ?

MLA vs RDO:ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన ఆర్డీఓ.. టిక్కెట్ ఎవరికి ?
ap latest news

MLA vs RDO (AP latest news):

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరిది అంటే.. ఎవరికి వారే తమకు నచ్చినట్లుగా సర్వేలు చేయించుకుని తమదే విజయమని దండోరా వేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు రాజకీయాలవైపు మొగ్గుచూపడంతో.. ఇప్పటికే తమకు టికెట్ ఖాయం అనుకున్న నేతల్లో ఆందోళన మొదలవుతోంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో నేతల పరిస్థితి అలాగే ఉంది. ఒకప్పటి ఉమ్మడి నెల్లూరు జిల్లా.. ఇప్పటి తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందరో రాజకీయ ఉద్దండులకు ఈ నియోజకవర్గం పురుడు పోసింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. వీరిద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. గూడూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు.


తిరుపతి ఎంపీగా పనిచేసిన వెలగపల్లి వరప్రసాద్ రావు 2019లో గూడూరు ఎమ్మెల్యేగా 40 వేల పైచిలుకు ఓట్లతో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో నాయకులను కలుపుకొని వెళ్లడం లేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి, వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలూ బలంగానే ఉన్నాయి. గతంలో అంగన్వాడీ కార్యకర్తల ఎంపికలోనూ భారీగా వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ ఆ జాబితాను పూర్తిగా పక్కన పెట్టి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఆగ్రహానికి గురయ్యారు. ఇక.. ప్రభుత్వంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు చక్రం తిప్పి రోనంకి గోపాలకృష్ణను ఇక్కడ నుంచి బదిలీ చేయించడంలో సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చెప్పిన వారికే అంగన్ వాడీ ఉద్యోగాలు దక్కాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు ఇక్కడకు రాకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడ్డారు.

మరోవైపు.. ఆర్డీవోగా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన మీసాల కిరణ్ కుమార్ విధి నిర్వహణలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షించి, పరుగుపెట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత నిధులతో సైతం చేయగలిగిన పనులను చేస్తున్నారు. చెరువు కట్ట తెగిపోయే పరిస్థితుల్లో మెడలోతు నీళ్లలో నడిచి వెళ్లడం, సుదీర్ఘకాలంగా కోటలో ఉన్న ఆక్రమణలను తొలగించడం, తుపానుల సమయంలో సహాయక చర్యలకు తానే స్వయంగా వెళ్లడం లాంటి క్లిష్టమైన పనులు చేపట్టారు. దీంతో ప్రజల్లో ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈసారి గూడూరు ఎమ్మెల్యే కిరణ్ కుమారే అన్నంతలా ఓ వర్గం ప్రచారం చేస్తోండటంతో ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు మింగుడు పడటం లేదు. ఆర్డీవో కిరణ్ కుమార్ చేసే పనులను వద్దనలేరు. అలా అని కలుపుకొని వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఎమ్మెల్యే పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.


ఇక.. ఆర్డీఓ కిరణ్ కుమార్ చేసేదంతా ఎమ్మెల్యే టికెట్ కోసమే అన్న విధంగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్డీఓ కిరణ్ కుమార్ అంటూ ఏకంగా ఓ వర్గం తలకెత్తుకుంది. మీడియాలో ఒక వర్గం సినిమా డైలాగులు జోడించి మరీ.. ఆర్డీఓ కిరణ్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ వచ్చేసినట్లేనని ప్రచారం చేస్తోంది. ఆర్డీవో పేరు చెప్పుకుని ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆక్రమణల తొలగింపులో భారీగా ఆ వర్గం ముడుపులు దండుకున్నట్లు బాహాటంగానే విమర్శలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమని ఆర్డీఓ మీసాల కిరణ్ కుమారే స్వయంగా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని బాహాటంగానే మాటలు వినిపిస్తుండటం గమనార్హం.

ఆర్డీఓ తీరుతో గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇటీవల నియోజకవర్గంలోని.. కోటలో జరిగిన ఓ సమావేశాన్ని ఆర్డీఓపై అస్త్రాలు సంధించేందుకు వేదిక చేసుకున్నారు. ఎవరి పని వారు చేయాలని.. గాడిద చేసే పని కుక్క, కుక్క చేసే పని గాడిద చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసంటూ ఆర్డీఓపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సహనానికి ఓ స్థాయి ఉంటుందని, పరిధి దాటితే చూస్తూ ఊరుకునేందుకు ఇక్కడ ఎవరు లేరని గట్టిగానే చెప్పారు. ఆర్డీవో మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఇప్పటి వరకు ఖండించలేదు. కానీ.. తన హైకమాండ్ వద్ద ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు.ఈసారి గూడూరు టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ తారా స్థాయికి చేరింది. నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మరి.. వైసీపీ అధిష్ఠానం గూడూరు టికెట్ ఎవరికి ఇస్తుందో తెలియాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×