ప్రతిపక్ష వైసీపీ బీసీ కార్డును ముందుపెట్టుకుని ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు అధికార పార్టీపై ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు, అసభ్య పదజాలం వాడటంతో సహనం కోల్పోయిన తెలుగుతమ్ముళ్లు మాజీ మంత్రుల ఇండ్లపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. వారి మీద ప్రభుత్వం కేసులు కూడా పెట్టించింది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు కావాలనే తమ కార్యకర్తలను రెచ్చగొట్టారని వైసీపీ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులుగా మాజీ సీఎం జగన్.. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా జగన్ సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ మీద తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై తెలుగు తమ్ముళ్లు దాడి చేయడాన్ని జగన్.. బీసీల మీద ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. బీసీ నేత మీద జరిగిన దాడి.. ఆ మొత్తం బీసీ సమాజం మీద జరిగినట్టే అని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని బీసీలు అంటే చిన్న చూపు ఉన్నదని విమర్శించారు. జోగి రమేశ్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందని.. వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారని.. వారికి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఫైర్ అయ్యారు. త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు ఒక్కొక్కరికి సమాధానం చెబుతామని జగన్ ఫైర్ అయ్యారు. అయితే, మాజీ మంత్రుల ఇంటికి జగన్ వస్తున్న సమయంలో చాలా మంది ప్రజలు, కార్యకర్తలు ఆయన కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపించింది.
వైసీపీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని.. అటు అంబటి రాంబాబు, ఇటు జోగి రమేశ్ ఇండ్ల మీద తెలుగు తమ్ముళ్ల దాడితో ప్రభుత్వానికి నెగెటివ్ అవ్వగా.. ప్రతిపక్ష వైసీపీకి మాత్రం పాజిటివ్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ సైతం దాన్ని క్యాష్ చేసుకోవడానికి బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రజలు జగన్ ట్రాప్లో ఇప్పుడిప్పుడే పడుతున్నారని సైతం ప్రచారం జరుగుతోంది. తమ సమస్యలు జగన్ తీరుస్తారని, ఆయనకు మొరపెట్టుకునేందుకు చాలా మంది జగన్ పరామర్శ సమయంలో విచ్చేసినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే జగన్ అండ్ కో వేసిన ప్లాన్ అలాంటిది అని కొందరు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు.అంబటి రాంబాబు విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తొందరపడకపోతే బాగుండేదని ప్రస్తుతం కూటమి సర్కార ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అంబటి రాంబాబు అన్న వ్యాఖ్యలను ప్రజల ముందు పెట్టి విమర్శిస్తే జనాలకు ఎవరు ఎంటనేది తెలిసేదని.. ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోయాయని.. తప్పు జరిగిపోయిందని ప్రభుత్వం సైతం ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం దగ్గరుండి తమ నేతలపై దాడులు చేయిస్తోందని జగన్ పదే పదే ప్రచారం చేయడంతో ప్రజలు సైతం నమ్ముతున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత చెబితే జనాలు నమ్ముతారు. రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ ఇలాగే తొందరపడితే ఎన్నికల సమయానికి ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయి అది కాస్త వైసీపీకి అనుకూలంగా మారే చాన్స్ ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి పలు నివేదికలు అందినట్టు తెలుస్తోంది.