Heavy Rains: ద్రోణి (Trough) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల వర్షాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, రైతన్నలను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విస్తరించనున్న వర్షాల ప్రభావం..
కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, ఈ వర్షాల ప్రభావం మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోస్తాంధ్ర, రాయలసీమలకు ఎల్లో అలర్ట్
అంతేకాకుండా వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉండటంతో, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
దెబ్బతింటున్న పంటలు, ఆందోళనలో రైతులు
ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కృష్ణా, చిత్తూరు జిల్లాలతో పాటు, మైలవరం, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు నేలవాలాయి. ముఖ్యంగా చేతికొచ్చిన వరి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: హైదరాబాద్ నారాయణగూడలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. ఇదిగో వీడియో!
ప్రజలకు అధికారుల హెచ్చరికలు..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద ఉండరాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థలు జారీ చేస్తున్న హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యం నిల్వలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల వర్ష సూచన
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్ష సూచన
పిడుగులు పడే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ధాన్యం నిల్వలపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన
ఉమ్మడి కృష్ణా, చిత్తూరు… pic.twitter.com/XNZIPQHjlq
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2026