Pulivendula: పులివెందుల నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వినాయక మండపం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి గమనించి గన్మేన్ గాల్లోకి కాల్పులు జరపడంతో మరొక వర్గం అక్కడి నుంచి పారిపోయింది. రాత్రి 11. 18 నిమిషాల సమయంలో జరిగింది. దీనికి సంబంధించి ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.
వినాయక చవితి వేళ కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైత్రి లేఔట్ ప్రాంతంలో వినాయక విగ్రహం వద్ద గొడవ జరిగింది. టీడీపీ నాయకులు పుష్పనాథ్ రెడ్డి- విజయ్కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య మాటా మాటా మొదలైంది. అది కాస్త తీవ్రరూపం దాల్చింది. నువ్వెంత అంటే నువ్వేంత అనుకునే స్థాయికి వెళ్లింది. పరిస్థితులు విషమించడంతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ.. హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా గన్మెన్ ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు.
విజయ్కుమార్ ఇంటి వద్ద నిలిపిన మూడు వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11. 18 నిమిషాల మధ్య జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పుష్పనాథ్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇరువర్గాలు టీడీపీకి చెందినవారు కావడంతో పార్టీ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వినాయక విగ్రహం వద్ద నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి అక్కడికి వచ్చినట్టు సమాచారం. ఆయనకు శాలువా కప్పారు పుష్పనాథరెడ్డి వర్గం. తనకు కప్పలేదని కక్ష పెంచుకున్నారు విజయ్కుమార్ రెడ్డి. ఆ తతంగం తర్వాత బీటెక్ రవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పుష్పనాథరెడ్డి- విజయ్ కుమార్ రెడ్డి వర్గాల మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో పుష్పనాథరెడ్డి వర్గం.. విజయ్ ఇంటిపైకి రాళ్లు వేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మహబూబ్ బాషా గన్మెన్ కాల్పులు జరిపినట్టు స్థానికులు చెబుతున్నారు. బీటెక్ రవి ప్రధాన అనుచరుడు విజయ్కుమార్ రెడ్డి గా చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సివుంది.