Weather Updates: వేసవి సీజన్ కావడంతో వాతావరణ శాఖ వేడి కబురు చెప్పింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని అలర్ట్ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఐఎండీ నివేదిక ప్రకారం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే పెరిగే అవకాశం ఉందని తేల్చిచెప్పింది.
ఏపీలో ఏప్రిల్ నెలలో వేడి తీవ్రత పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వేసవి సీజన్ అంతా భానుడు తన ప్రతాపం చూపనున్నాడు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తేల్చిచెప్పింది. ఈ లెక్కన రానున్న మూడు నెలలు వడగాలులు సైతం వీయనున్నాయి.
అంతేకాదు ఏప్రిల్లో మూడు నుంచి నాలుగు రోజులు వేడి గాలులు వీస్తాయని తేల్చిచెప్పింది. ఇక మే, జూన్ మాసాలు పది లేకుంటే ఎక్కువ రోజులు వేడిగాలులు తప్పవని తేల్చేసింది. కేవలం పగటి వేళలు మాత్రమేకాదు రాత్రి సమయాల్లో వేడిగానే ఉంటుందని తెలియజేసింది.
ఇప్పటికే ఏపీలో వేడి తీవ్రమవుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. సాధారణంగా మే నెలలో ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అవుతాయి. ఈసారి విశాఖపట్నం , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెరుగుతున్న తేమ కారణంగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండనుంది. ఏప్రిల్ నెలంతా ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.
గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరా పెరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెల్సిందే.
కేవలం ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణలో ఏప్రిల్ నెల వేడి అధికంగా ఉంటుందని ఐఎండి పేర్కొంది. కాకపోతే అప్పుడప్పుడు కురుస్తున్న జల్లులు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ALSO READ: డిప్యూటీ స్పీకర్ రఘురామను అడ్డుకున్న గ్రామస్థులు.. పెదపేటలో జరిగిన గొడవలకు అదే కారణం
రాబోయే మూడు నెలలు దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, ఎండలు, వడగాలులు, వర్షాలపై భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఏపీతోపాటు ఒడిషా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని తేల్చి చెప్పింది.
దేశంలోని దాదాపు 95 శాతం రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదు అవుతాయని వెల్లడించింది. ఏప్రిల్లో ఈశాన్య రాష్ట్రాలు తప్ప అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని సూచించింది. మార్చిలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 33.7 మిల్లీమీటర్లు నమోదైంది. గడిచిన 125 ఏళ్లుగా పరిశీలిస్తే మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోద కావడం ఇది 32వ సారి.