Pedapeta Rama Temple Issue: పశ్చిమ గోదావరి జిల్లా పెదపేటలోని పురాతన రామాలయం వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లగా, స్థానికంగా ఉన్న ఒక వర్గానికి చెందిన వారు ఆయనను తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ ఆలయంలో కేవలం నందీశ్వరుడికి మాత్రమే పూజలు నిర్వహించాలని, శ్రీరాముడి విగ్రహానికి దండ వేయకూడదని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆయన కాన్వాయ్కు అడ్డంగా నిలబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు తప్పించి, కఠిన భద్రత మధ్య రఘురామను ఆలయంలోకి తీసుకెళ్లారు. లోపల నినాదాలు, నిరసనల మధ్యే ఆయన శ్రీరాముడికి పూలమాల వేసి తన పూజా కార్యక్రమాలను ముగించుకున్నారు.
ఈ వివాదంపై పెదపేట గ్రామస్థుడైన దత్త శ్రీనివాసరావు స్పందిస్తూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో గత కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు కొనసాగుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం డిప్యూటీ స్పీకర్ (ఎమ్మెల్యే) గారే చూపించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “మాకు ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే, మేమంతా కలిసి మా సమస్యలను ఆయనకు వివరించుకుంటాం. ఎమ్మెల్యే గారు మమ్మల్ని కరుణించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం” అని ఆయన విన్నవించారు.
పెదపేటలో జరిగిన గొడవలకు బయటి వ్యక్తుల ప్రేరేపణే కారణమని శ్రీనివాసరావు ఆరోపించారు. రాజేష్ కన్నా, ఇస్మాయిల్ మరియు మీసాల (పూర్తి పేరు తెలియదు) అనే వ్యక్తులు తమ సంఘం వారిని రెచ్చగొట్టడం వల్లే డిప్యూటీ స్పీకర్ పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. “బయటి వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్లే ఈ అపశ్రుతి దొర్లింది. ఇకపై మా సంఘంలోకి, మా గ్రామంలోకి బయటి వ్యక్తులను రానివ్వకుండా మేమే చూసుకుంటాం. ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మమ్మల్ని పిలిచి మాట్లాడితే ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుంది.” అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: ఏపీలో రూ.5 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. రూ.11 వేల రాయితీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?