Indrakeeladri Rush: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో దుర్గమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భారీగా భక్తులు వస్తుండడంతో తిరుమల తరహాలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు.
కొండపై క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వినాయక గుడి నుంచి సుమారు 3 కి.మీ మేర భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం కావడంతో 3 లక్షల పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుమల తరహాలో భక్తులకు హోల్డింగ్ పాయింట్స్, పదికి పైగా కంపాట్మెంట్లు ఏర్పాటు చేశారు.
క్లూ లైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్లూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, బిస్కెట్ పాకెట్స్, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.భక్తులు ఎంత మంది వచ్చినా కోరినన్ని లడ్డూలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 నిమిషాలకు సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో ఘాట్ల వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జల్లు స్నానాలు చేసేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. నది ఘాట్ల వద్ద స్నానాలు నిషేధించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోటర్లు, ట్యాప్ ల వద్దనే భక్తులు స్నానాలు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు వచ్చే వారు నిర్ణీత గడువు లోగా ఆలయానికి అధికారులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఘాట్ రోడ్ సహా పలు మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్టుమెంట్లలో భక్తుల రద్దీ
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 6,57,473 క్యూసెక్కుల వరద వస్తుంది. బ్యారేజీ గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 5,66,860 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది ఉద్ధృతంగా ఉండడంతో ఒడ్డున స్నానాలను నిషేధించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు జల్లు స్నానాలు మాత్రమే ఆచరించాలని కోరారు.