Kakinada Animal fat oil: నేటి సమాజంలో స్వార్థం పెరిగిపోయి, మనిషి ప్రాణం కంటే పైసాకే విలువ ఎక్కువైపోతోంది. నకిలీ వస్తువుల తయారీదారుల ధనదాహానికి సామాన్యుల ఆరోగ్యం బలైపోతోంది. ముఖ్యంగా.. మూగజీవాలను అత్యంత క్రూరంగా చంపి, వాటి కొవ్వు నుంచి తీసిన ఆయిల్ను వంట నూనెగా మార్చి విక్రయిస్తున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ముఠాపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, మెరుపు దాడులు నిర్వహించి భారీ ఎత్తున సాగుతున్న కల్తీ నూనె తయారీ కేంద్రాలను బట్టబయలు చేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గత కొద్దిరోజులుగా రహస్యంగా సాగుతున్న కల్తీ నూనె తయారీ కేంద్రాన్ని పోలీసులు రట్టు చేశారు. పిఠాపురం మండలానికి చెందిన బండారు ఫణి ప్రసాద్ అనే వ్యక్తి ఈ దందాకు ప్రధాన సూత్రధారి. ఇతను ధర్మవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత నాలుగు నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ నకిలీ వంట నూనెను తయారు చేస్తున్నాడు.
సాధారణంగా వంట నూనెను గింజల నుండి సేకరిస్తారు. కానీ ఫణి ప్రసాద్ లాభాల కోసం అత్యంత హానికరమైన పద్ధతులను ఎంచుకున్నాడు.
చనిపోయిన జంతువుల నుంచి సేకరించిన కొవ్వును మరిగించి నూనెలా మారుస్తూ..పారిశ్రామిక అవసరాలకు వాడే క్రూడ్ ఆయిల్ను దీనికి జత చేస్తున్నాడు. వీటిని కలిపి మరిగించి, రంగు, వాసన రాకుండా కొన్ని రసాయనాలు కలిపి సాధారణ వంట నూనెగా ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇలా తయారైన నూనెను మార్కెట్లోకి పంపిస్తూ అమాయక ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాడు.
ఖచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు ధర్మవరంలోని తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో కల్తీ నూనె బయటపడింది. దాదాపు 844 కేజీల సిద్ధంగా ఉన్న నకిలీ వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 60 కేజీల క్రూడ్ ఆయిల్, ఇతర తయారీ సామాగ్రిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మెుత్తం సామాగ్రి విలువ సుమారు రూ.1.50 లక్షల విలువ ఉంటుందని అంచనా.
నిందితుడు బండారు ఫణి ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ కల్తీ నూనెను ఏయే ప్రాంతాలకు సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ALSO READ: జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. పవన్కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..