Tirumala News: తిరుమలలో రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. ఏ మాసం వచ్చినా భక్తులు అధికంగా తరలివస్తున్నాయి. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో భక్తుల రద్దీ తగ్గుతుందని భావించారు. అయినా రోజు రోజుకూ పెరగడంతో సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేసింది టీటీడీ.
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్-మాసం ఏదైనా తిరుమలలో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ప్రతీరోజూ తరలి వస్తున్నారు. వీకెండ్ కాకుండా సాధారణ రోజుల్లో భక్తులు భారీగా తరలి రావడంతో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ సమయం తీసుకుంటోంది. మంగళవారం భక్తుల సంఖ్య అమాంతంగా పెరిగింది.
సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు –ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో బుధవారం జారీ చేయాల్సిన గురువారం దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేయనుంది.
తిరుపతిలో మూడు కేంద్రాల్లో బుధవారం ఇవ్వాల్సిన టోకెన్ల జారీని రద్దు చేసింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత కూడా భక్తులు అధికంగా తరలివస్తున్నారు. జూన్, జూలై మాసాల్లో పలుమార్లు ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టోకెన్లు రద్దు చేయడం వరుసగా ఇది నాలుగో వారం. టోకెన్లు లేని భక్తులు సర్వ దర్శనం క్యూలైన్లలోకి వెళ్లాలని సూచన చేసింది టీటీడీ.
శుక్రవారం దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లను యథావిధిగా జారీ చేస్తామని తెలిపారు అధికారులు. బుధవారం దర్శనం కోసం కేటాయించిన 10 వేల సర్వదర్శనం టోకెన్లు, మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు 2 వేల టోకెన్ల కోటా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు క్లోజ్ అయ్యింది.
ALSO READ: భోగాపురం ఎయిర్పోర్ట్పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!
టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. చివరకు నిరాశతో తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది టీటీడీ. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలను వేగంగా అందించేందుకు ఎక్స్ లిఫ్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.
దీని పనితీరును ట్రయల్ రన్ ద్వారా పరీక్షించారు. క్యూలైన్లలో భక్తులకు ఆహారం, నీరు, పాలు వంటివి ఎంత వేగంగా చేరవేయగలదనే అంశాలను పరిశీలించారు. ట్రయల్ విజయవంతమైతే కొత్త వ్యవస్థను శాశ్వతంగా అమల్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది టీటీడీ.