SriCity: దేశానికి అవసరమైన 80 శాతం ఏసీలను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామన్నారు మంత్రి నారా లోకేష్. పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. త్వరలో భారతదేశపు కూల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని మనసులోని మాట బయపెట్టారు.
పారిశ్రామికవేత్త ఒక్క మెసేజ్ చేస్తే చాలన్న మంత్రి లోకేష్
బుధవారం నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ఏసీ తయారీ సంస్థ ‘క్యారియర్’ యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, 2028 నాటికి దేశానికి అవసరమైన ఏసీ 80 శాతం ఇక్కడే తయారు చేసే స్థాయికి ఎదుగుతామన్నారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు సూచన చేశారు.
ఏ తరహా సేవలైనా వాట్సాప్ మేసేజ్ చేస్తే పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. అంతేకాదు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ నెల చివరిలోపు ఏఐ ద్వారా నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామన్నారు.
శ్రీసిటీలో ఏసీ తయారీ సంస్థ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేష్
క్యారియర్ గ్లోబల్ సంస్థ 1000 కోట్లు రూపాయలు పెట్టుబడి ఈ ప్రాంతంలో పెట్టనుందన్నారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల భూమి కేటాయించామన్నారు. ఇంటికి సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా, పారిశ్రామిక సముదాయాలు వినియోగించే ఏసీలను ఈ సంస్థ తయారు చేస్తుందన్నారు.
దాదాపు 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ సిస్టమ్స్ను తయారు చేయనుంది ఈ సంస్థ. ఇదే సమయంలో శ్రీసిటీ సాధించిన ప్రగతిని వివరించారు. 8,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీ, దాదాపు 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ ప్రాంతం నుంచి ప్రతీ ఏటా 6 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయని వివరించారు.
ALSO READ: గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు!
ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు క్యారియర్ రాకతో ఈ ప్రగతి ప్రస్థానంలో మరో మైలురాయి చేరిందన్నారు. ఇప్పటికే 9 ఏసీ తయారీ కంపెనీలు, 30కి పైగా అనుబంధ పరిశ్రమలు ఇక్కడున్నాయన్నారు. ఎకో సిస్టమ్ ద్వారా సుమారు రూ. 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.