Lucknow: లక్నోకు చెందిన అశోక్ బహార్ కథ వింటే ‘వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అనే మాట అక్షరాలా నిజమనిపిస్తుంది. సాధారణంగా 70 ఏళ్లు దాటాక చాలామంది రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. కానీ, అశోక్ బహార్ మాత్రం చేతిలో కలం పట్టి, కుర్రాళ్లతో పోటీ పడుతూ నీట్ (NEET) పరీక్షా కేంద్రంలో అడుగుపెట్టారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం చదివితే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి.
అశోక్ బహార్ని డాక్టరుగా చూడాలనేది ఆయన తల్లి చివరి కోరిక. వృత్తిరీత్యా వేరే రంగంలో స్థిరపడినా, తల్లి ఆశయాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, 70 ఏళ్ల వయసులో మళ్లీ పుస్తకాలు పట్టారు. సిలబస్ మారింది, పరీక్షా విధానం మారింది, తనకంటే 50 ఏళ్లు చిన్నవారైన విద్యార్థులతో కలిసి చదవడం అంత సులువు కాదు. అయినా సరే, అశోక్ బహార్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. పట్టుదలతో చదివి పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షా కేంద్రానికి వచ్చిన అశోక్ బహార్ని చూసి తోటి విద్యార్థులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. కానీ ఆయన ముఖంలో మాత్రం ఒకటే లక్ష్యం కనిపించింది.. అది తల్లి కోరికను నెరవేర్చడం. ఒక మనిషికి సంకల్ప బలం ఉంటే ఆకాశమే హద్దు అని ఆయన నిరూపించారు.
ఈ రోజుల్లో చిన్న చిన్న అడ్డంకులు రాగానే నిరాశ చెందే యువతకు, ‘మా వల్ల కాదు’ అని ఆశలు వదులుకునే వారికి అశోక్ బహార్ ఒక గొప్ప పాఠం. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదని, ప్రయత్నించే గుణం ఉంటే ఏ కాలంలోనైనా విజేతలుగా నిలవవచ్చని ఆయన చాటి చెప్పారు. తన తల్లిపై ఉన్న ప్రేమను, లక్ష్యం పట్ల ఉన్న అంకితభావాన్ని చాటిన అశోక్ బహార్ పట్టుదలకు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే!
Also Read: అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్