ONGC Gas Leak: ఆంధ్ర ప్రదేశ్ లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కారణంగా సంభవించిన భారీ ‘బ్లో అవుట్’ ప్రమాదం స్థానిక రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఎగసిపడుతున్న మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాద తీవ్రతకు పచ్చని కొబ్బరి తోటలు మాడిమసైపోతున్నాయి.
ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ పైప్లైన్ వద్ద గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ, వేడితో నిండిపోయింది. ఈ మంటల ధాటికి సుమారు 500కు పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా కాలి బూడిదనైట్లుగా తెలుస్తోంది..
కేవలం కాలిపోయిన చెట్లే కాకుండా, మంటల నుంచి వస్తున్న విపరీతమైన వేడికి చుట్టుపక్కల తోటల్లోని కొబ్బరి చెట్లు కూడా దెబ్బతింటున్నాయి. వేడి తీవ్రత తట్టుకోలేక చెట్లపై ఉన్న కొబ్బరి బోండాలు నేల రాలుతున్నాయి. దీంతో పంట చేతికి రాకుండానే నాశనమవుతోందని రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ ఘటనపై కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఒకప్పుడు కోనసీమలో రెండు ఎకరాల కొబ్బరి తోట ఉంటే కోటేశ్వరుడితో సమానంగా బతికేవాళ్లం. కానీ ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా తోటలు కళ్ల ముందే కాలిపోతున్నాయి. మేం పూర్తిగా నష్టపోయాం.” అని రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో పంట దిగుబడిపై ఈ ప్రమాద ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన తమను ఆదుకోవాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ONGC కూడా దీనిపై అధికారికంగా స్పందించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని.. సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది.
Read Also: మార్కాపురం జిల్లాలో దారుణం.. మహిళను కొట్టి చంపి.. AR కానిస్టేబుల్ సూసైడ్