Amaravati: వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లేవారికి ముఖ్య గమనిక. ఇన్నాళ్లు మాదిరిగా రాత్రికి బస్సు ఎక్కి ఉదయం ఇంటి వద్ద దిగిపోయే రోజులు పోయినట్టే. ఎందుకంటే ప్రైవేటు బస్సుల్లో అతి వేగాన్ని తగ్గించేందుకు రవాణా శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఏ మాత్రం తేడా వచ్చినా బస్సు ఓనర్ బుక్కైనట్టే. అసలు మేటర్ ఏంటి?
ఏపీలో రవాణా శాఖ కొత్త నిర్ణయాలు.. ప్రైవేటు బస్సులకు ఇక ఇత్తడే
ఏపీలోని ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగల, సమ్మర్ సమయాల్లో సొంతూర్లకు పయనం అవుతుంటారు. వేగంగా ఇంటికి వెళ్లే క్రమంలో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఏపీలో వరుస ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగితే కనీసం 10 నుంచి 20 మధ్య ప్రయాణికులు మృత్యువాతపడ్డారు.
అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు సిద్ధమైంది ఏపీ రవాణా శాఖ. ముఖ్యమంత్రి ఆదేశాలతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగేశారు. ట్రావెల్స్ బస్సుల వేగానికి కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యారు. ఇకపై ప్రైవేటు బస్సులకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇకపై ఏ ట్రావెల్స్ బస్సయినా గంటకు 80 కిలోమీటర్లు మించి వెళ్లడానికి వీల్లేదు.
80 కిలోమీటర్లు దాటితే బుక్కైపోతారు, ఆపై ట్రాకింగ్ చిప్
ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కింద సుమారు 1800 బస్సులు ఏపీలో రిజిస్టర్ అయ్యాయి. అందులో దాదాపు 1,600 బస్సులకు జీపీఎస్ వ్యవస్థను అనుసంధానం చేశారు. దీనిద్వారా ఏ బస్సు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అధికారులు క్షణాల్లో తెలిసిపోతుంది. అధికారులు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించనున్నారు.
ఒకవేళ 80 కిలోమీటర్ల వేగం దాటినట్టు నిర్ధారణ అయితే అధికారులు ఆ బస్సును సీజ్ చేసే అవకాశం ఉంది. బస్సును ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు తరలించి స్పీడ్ లిమిట్ను తనిఖీ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు తేలితే బస్సు ఓనర్కు ఇబ్బందులు తప్పవు.
ALSO READ: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి.. బాలకృష్ణ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన
మోటారు వాహన చట్టం ప్రకారం బస్సుల్లో స్పీడ్ లిమిట్ పరికరాలు ఉన్నప్పటికీ, ట్రావెల్స్ బస్సులు వాటిని పట్టించుకోకుండా అతివేగంతో నడిపేవారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. రవాణా శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి బస్సుల కదలికలను నిత్యం గమనిస్తున్నారు అధికారులు.
అధికారుల కఠిన చర్యలు చేపట్టడంతో ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలపై దృష్టి సారించాయి. దీంతో చాలా బస్సులు పరిమిత వేగంతో నడుస్తున్నాయి. ఇదిలా కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో బస్సు ప్రమాదాలు జరగవని అంటున్నారు.