ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెనువెంటనే దేశంలో ద్రవ్యోల్బణం సెగ మొదలవుతుందని తాను ముందుగా ఊహించినట్టే జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడం పట్ల ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు ఏకంగా 993 రూపాయలు పెరగడం సామాన్యుడి నడ్డి విరిచే చర్యగా ఆయన అభివర్ణించారు. ఒకే రోజులో ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే తొలిసారి అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇది ప్రజలపై మోపిన ‘ఎన్నికల బిల్లు’ అంటూ విమర్శించారు.
ఫిబ్రవరి నెల నుండి ఇప్పటి వరకు గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 1,380 రూపాయల పెరుగుదల నమోదైంది. కేవలం మూడు నెలల కాలంలోనే 81 శాతం మేర ధరలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాదుడు వల్ల చిన్న తరహా వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. చాయ్వాలాలు మొదలుకొని ధాబాలు, హోటళ్లు, బేకరీలు, మిఠాయి దుకాణాల వరకు ప్రతి ఒక్కరి వంటగదిపై ప్రభుత్వం పెను భారం మోపిందని దుయ్యబట్టారు.
వ్యాపార అవసరాలకు వాడే గ్యాస్ ధరలు పెరగడం వల్ల నేరుగా ప్రజల భోజనపు ప్లేటుపై ప్రభావం పడుతుందని ఆయన విశ్లేషించారు. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగా గ్యాస్ ధరలపై దాడి చేసిందని, ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజా ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ALSO READ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్